
Lakhimpur Kheri violence: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. లక్నో హైకోర్టు బెంచ్ నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడైన ఆశిష్ మిశ్రా బెయిల్ కు సంబంధించి మంగళవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ సంబంధించిన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచింది. గురువారం నాడు బెయిల్ మంజూరుకు అనుమతించింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికోనియా గ్రామంలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు పోనిచ్చిన ఘటన నేపథ్యంలో ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ కుట్ర
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనకు దిగారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా రైతు మహా పంచాయత్ లను నిర్వహించారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 3న, లఖింపూర్ ఖేరీలోని టికునియా వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే సమయంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనంతో రైతులను ఢీ కొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) విచారణ అనంతరం.. రైతులపైకి కారును పొనిచ్చిన ఘటన అంతా పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర పేర్కొంది. దీని తరువాత, సిట్ 5000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, అందులో ఆశిష్ మిశ్రా హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటనలో మొత్తం 16 మందిని సిట్ నిందితులుగా పేర్కొంది. నిందితులపై సిట్ ఐపీసీ సెక్షన్లు 307, 326, 302, 34,120బి, 147, 148,149, 3/25/30 అభియోగాలు మోపింది.
చనిపోయిన వారిలో రైతులు, జర్నలిస్టు..
గత ఏడాది అక్టోబర్ 3న, లఖింపూర్ ఖేరీలోని టికునియా వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కాన్వాయ్.. రైతులపై దూసుకెళ్లింది. ఈ సమయంలో కాన్వాయ్ లోని రైతులపైకి పోనిచ్చిన కారును నడుపుతున్నది కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రానే ఆరోపణలు ఉన్నాయి. కావాలనే ఈ కుట్రకు పాల్పడ్డారని సిట్ సైతం తేల్చింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రైతులతో పాటు ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు సిరియస్ అయి.. సుమోటోగా కేసును స్వీకరించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆజయ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారునికి బెయిల్ మంజూరు కావడం గమనార్హం.