జయలలిత 27 కిలోల బంగారం మాకే చెందాలి.. హైకోర్టులో వారసుల పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే?

By Mahesh KFirst Published Mar 6, 2024, 5:34 PM IST
Highlights

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసంలో అధికారులు సీజ్ చేసిన 27 కిలోల బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనే ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆమె వారసులు హైకోర్టులో అప్పీల్ చేశారు. జయలలితకు తామే చట్టబద్ధమైన వారసులం అని ఆమె అన్నయ్య కుమార్తె, కుమారుడు పేర్కొన్నారు.
 

Jayalalitha: జయలలిత నివాసంలో సీజ్ చేసిన 27 కిలోల బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ జయలలిత వారసులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలపై స్టే విధించింది. 1997లో చెన్నైలో జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌లో బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారించడానికి అప్పుడే ఓ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే వాటిని బెంగళూరుకు తరలించారు.

జయలలిత అన్న కుమార్తె దీప జయకుమార్, కుమారుడు దీపక్‌లు కర్ణాటక హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. తమిళనాడు మాజీ సీఎం జే జయలలితకు తామే చట్టబద్ధ వారసులం అని వారు వాదించారు. ఆమె ఆస్తులు తమకే చెందాలని తెలిపారు. ఈ వాదనలు విన్న తర్వాత కర్ణాటక హైకోర్టు స్పెషల్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

స్టే ఆదేశాలు వచ్చాయని, తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి కర్ణాటక హైకోర్టు వాయిదా వేసిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ ఎస్ జావలి పేర్కొన్నారు.

Also Read: ఇన్నాళ్లు మనం నమ్మిందంతా అవాస్తవమేనా? పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం!

ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెషల్ కోర్టు.. రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, విజిలెన్స్, కరప్షన్ శాఖ ఐజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7వ తేదీ ఉదయమే వారు ఆరు పటిష్టమైన పెట్టెలతో కోర్టు ముందు హాజరు కావాలని, ఆ తర్వాత ఆ బంగారు ఆభరణాలను అందులో పెట్టుకుని చెన్నైకి తీసుకెళ్లాలని పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. హైకోర్టులో దీప జయకుమార్ ఆ ఆదేశాలను తోసిపుచ్చాలని పిటిషన్ వేశారు. తాను, తన సోదరుడు జయలలితకు చట్టబద్ధమైన వారసులని వాదించారు. 2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించినప్పుడు ఆమెను నేర నిర్దారణ చేసే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని పేర్కొన్నారు. అయితే.. జయలలిత వాదనలు ఎప్పటికీ కోర్టులో వినిపించలేకపోయారని తెలిపారు. కాబట్టి, ఆమె బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలనే స్పెషల్ కోర్టు ఆదేశాలు తోసిపుచ్చాలని కోరారు. దీంతో కర్ణాటక హైకోర్టు స్పెషల్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

click me!