
ఓ వ్యక్తి శశ్మానంలో తల్లి సమాధిని తవ్వి ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లోనే దాచిపెట్టాడు. తమిళనాడులో (ఒలచున యలదె) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెరంబలూరు జిల్లా (Perambalur district ) కున్నం సమీపంలోని పరవై గ్రామానికి చెందిన వి బాలమురుగన్కు(38) పెళ్లి కాలేదు. ఉద్యోగం కూడా లేదు. అయితే అతడు తల్లి ముక్కాయి(65), తండ్రి వేలు సంరక్షణలో పెరిగాడు. అయితే బాలమురుగన్ తండ్రి 10 ఏళ్ల క్రితం మృతిచెందాడు. తర్వాత తల్లి బాలమురుగన్ బాగోగులు చూసుకునేది. అయితే అతని తల్లి ముక్కాయి అనారోగ్యంతో బాధపడుతూ 10 నెలల క్రితం మరణించింది.
అయితే ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని బాలమురుగన్.. మానసికంగా కుంగిపోయాడు. తన తల్లి అంత్యక్రియలు జరిగిన గ్రామంలోని శ్మశానానికి రోజు వెళ్లేవాడు. అక్కడ తనలో తానే మాట్లాడుకునేవాడు. చాలా సార్లు అక్కడే నిద్రపోయేవాడు. వర్షం పడితే సమాధి తడవకుండా ఉండేలా చూసేవాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున బాలమురుగన్ శ్మశానంలో తన తల్లి సమాధిని తవ్వి.. పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. మరియు దానిని ఇంట్లోనే దాచిపెట్టాడు. అయితే అతనికి ఆ రోజు రాత్రి భోజనం అందించడానికి ఇంటికి వచ్చిన బంధువు ఒకరు ఇంట్లో దుర్వాసన రావడం గమనించారు. దుర్వాసన గురించి అడిగితే బాలమురుగన్ తన బంధువును అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు.
Also Read: దారుణం: నన్నే ‘‘అంకుల్’’ అంటావా.. 18 ఏళ్ల బాలికను చావబాదాడు
దీంతో అనుమానం వచ్చిన బంధువులు అంతా కలిసి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అక్కడ పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహం ఉండటం చూసి షాక్ తిన్నారు. దీంతో బంధువులు, స్థానికులు ఇందుకు సంబంధించి కకున్నం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ నిమిత్తం బాలమురుగన్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సమక్షంలో దహనం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ‘బాలమురుగన్ గతంలో తన తల్లి మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు అతన్ని ఖననం చేసిన ప్రదేశంలో పట్టుకున్నారు. అతను మానసికంగా కలవరానికి గురైనట్లు తెలుస్తోంది' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాలమురుగన్ అంతా నిద్రిస్తున్న సమయంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడని, అతని ఇల్లు శ్మశాన వాటికకు కిలో మీటర్ దూరంలోనే ఉండటంతో.. గ్రామస్తులు గుర్తించలేకపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కున్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.