
బీహార్ : మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఆనంద్ మోహన్, బీహార్ జైలు నిబంధనల సవరణతో గత నెలలో సహర్సా జైలు నుంచి బయటకు వచ్చారు.
గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు అయిన ఆనంద్ మోహన్ ను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి భార్య ఉమా కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు, ఆనంద్ మోహన్ను విడిపించే జైలు నిబంధనలను సవరించడానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యపై కేంద్ర పౌర సేవల అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం "తీవ్రమైన నిరాశను" వ్యక్తం చేసింది, ఇది "న్యాయ నిరాకరణతో సమానం" అని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం: శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు
ఆనంద్ మోహన్ అకాల విడుదలతో బీహార్లో జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడం రాజకీయ దుమారం రేపింది. ఆనంద్ మోహన్ను నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే జైలు నుంచి విడుదల చేశారని రాష్ట్ర ప్రభుత్వం మొండిగా చెబుతోంది.
ఉత్తర బీహార్లోని కోసి ప్రాంతానికి చెందిన 'బాహుబలి' ఆనంద్ మోహన్ డిసెంబర్ 5, 1994న గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలాడు. గ్యాంగ్స్టర్-రాజకీయవేత్త కొంతమందిని రెచ్చగొట్టి, కృష్ణయ్యను హత్య చేయించాడు. ఆయనను తన ప్రభుత్వవాహనంలోంచి బయటకు లాగి కొట్టి చంపారు.
ఆనంద్ మోహన్కు 2007లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత, పాట్నా హైకోర్టు ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టులో తీర్పును సవాలు చేశాడు, కానీ ఇంకా ఉపశమనం లభించలేదు. 2007 నుండి ఆనంద్ మోహన్ సహర్సా జైలులో ఉన్నాడు.
మాజీ ఎంపీ.. కృష్ణయ్య హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. బీహార్ ప్రభుత్వం జైలు మాన్యువల్ నిబంధనలను సవరించిన తరువాత, 14 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన 27 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించినట్లు అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది. 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆనంద్ మోహన్ ఏప్రిల్ 27న విడుదలయ్యారు.