
న్యూఢిల్లీ : జైలు కాంప్లెక్స్లో గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా దారుణ హత్యను ఆపడంలో విఫలమెందుకు అయ్యారని ఢిల్లీ హైకోర్టు ఈ రోజు తీహార్ జైలు అధికారులను నిలదీసింది. జైలు అడ్మినిస్ట్రేషన్ నుండి స్టేటస్ నివేదికను కోరింది. జైలు సూపరింటెండెంట్ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ ఘటన జైలులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినా కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో కోర్టు అర్థం చేసుకోలేకపోతున్నదని జస్టిస్ జస్మీత్ సింగ్ అన్నారు. జైలు కాంప్లెక్స్ లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
హత్యకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజీని జస్టిస్ సింగ్ చూశారు. అందులో 33 ఏళ్ల తాజ్పురియాను అతని సెల్ నుండి బయటకు లాక్కొచ్చి కత్తితో పొడిచి చంపినట్లు కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాని పరిస్థితి అని హైకోర్టు పేర్కొంది.
గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియా హత్య కేసు: 9 మంది తీహార్ జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు
దాడికి పాల్పడిన వ్యక్తులు ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి కత్తులు తయారు చేసి, బెడ్షీట్లను ఉపయోగించి సెల్ లోకి దూకి, అతని సెల్లోకి దూసుకెళ్లి కొట్టి చంపారని పోలీసు వర్గాలు తెలిపాయి. తాజ్పురియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తాజ్పురియా తండ్రి, సోదరుడు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. భద్రత కల్పించడాన్ని పరిశీలించాలని జస్టిస్ జస్మీత్ సింగ్ ఢిల్లీ పోలీసులను కోరారు.
ఈ లోపానికి బాధ్యులైన అధికారుల బాధ్యత, జవాబుదారీతనాన్ని వివరించాలని కూడా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. 2021లో ఢిల్లీ కోర్టులో మరో గ్యాంగ్స్టర్ జితెంగర్ గోగీని హత్య చేయడం వెనుక టిల్లూ తాజ్పురియా ఉన్నాడన్న ఆరోపణలతో.. మే 2న తీహార్ జైలులో పదునైన ఆయుధాలతో పొడిచి చంపారు.
గాయపడిన గ్యాంగ్స్టర్ను ప్రత్యర్థి ముఠా సభ్యులు దాదాపు 90 సార్లు పొడిచి చంపారు. చంపిన తర్వాత నలుగురు సిబ్బంది అతన్ని ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా టిల్లు తాజ్పురియాపై మళ్లీ దాడి చేశారు. వారిని నిరోధించడంలో పోలీసుల ప్రయత్నం విఫలమైనట్లు కనిపించింది. అతడిని కొట్టి చంపడం చూస్తూ పోలీసులు వెనక్కి తగ్గడం అందులో కనిపిస్తుంది.
ముగ్గురు వ్యక్తులు వంతులవారీగా టిల్లును కొట్టారు. వారిలో ఒకరు టిల్లు తాజ్పురియా అచేతనంగా మారిన తరువాత దారుణంగా ఒక్క తన్ను తన్నాడు. ఈ ఘటన మే 2 (మంగళవారం) ఉదయం 6.15 గంటలకు జరిగినట్లుగా వీడియోలోని టైమ్ చూపిస్తుంది.
టిల్లూ తాజ్పురియా శరీరంపై దాదాపు 100 గాయాల గుర్తులు ఉన్నాయి. టిల్లూ తాజ్పురియాను కత్తితో పొడిచి చంపినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ సంఘటన సమయంలో మౌన ప్రేక్షకులుగా నిలబడినందుకు వారిని తిరిగి తమిళనాడుకు పంపారు.