
Russia Ukraine Crisis: రష్యా - ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి... యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది భారతీయుల పరిస్థితి దారుణంగా మారడంతో.. ప్రభుత్వం వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఉక్రెయిన్ పై రష్యా దాడి కారణంగా అక్కడ చదువుతున్న అనేక మంది భారత వైద్య విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపి స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుంచి దాదాపు 18,000 మంది భారతీయ వైద్య విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తీసుకువచ్చారు. అయితే, యుద్ధ ప్రభావిత ప్రాంతం నుంచి భారత పౌరులందరూ సురక్షితంగానే స్వదేశానికి చేరినప్పటికీ.. మధ్యలోనే వైద్య విద్యను విడిచిపెట్టి వచ్చిన విద్యార్థులు పరిస్థితి నేడు దారుణంగా మారింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారిని భారత వైద్య కాలేజీల్లో చేర్చుకోవాలనీ, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. దేశరాజధానిలో నిరసనలు దిగారు.
ఉక్రెయిన్-భారత వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి.. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. భారతీయ వైద్య సంస్థల్లో తమ అడ్మిషన్ కోసం వారు డిమాండ్ను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ MBBS విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ లో భాగంగా ఉన్న వందల మంది తల్లిదండ్రులు, విద్యార్థులు తమ మిగిలిన వైద్య విద్య కోర్సులను పూర్తి చేయడానికి భారతీయ మెడికల్ కాలేజీల్లో అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ RB గుప్తా మాట్లాడుతూ.. "ఈ విద్యార్థులను పోలాండ్, హంగ్రీ మరియు యూరోపియన్ దేశాలలో ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. వారు అక్కడికి వెళ్లి చదువుకునే పరిస్థితులు భారంగా మారాయి. కాబట్టి దేశంలోని తక్కువ ఫీజులు ఉండే మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యను పూర్తి చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని కోరుతున్నాం" అని అన్నారు. ఉక్రెయిన్ లో వైద్య విద్య కోసం వెళ్లినవారు అందరూ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారని తెలిపారు.
ఖార్కివ్ విశ్వవిద్యాలయంలో MBBS విద్యార్థి తండ్రి డాక్టర్ రాజేష్ కుమార్ చందేల్ మాట్లాడుతూ.. "మేము నిరసన చేయడం లేదు, మేము మా పిల్లలను కళాశాలల్లో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. తమ పిల్లలను భారతీయ వైద్య కళాశాలల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడానికి తల్లిదండ్రులందరూ ఢిల్లీకి వచ్చారు" అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో చదువుతున్న విద్యార్థులకు పోలాండ్, హగేరీలు తమ వైద్య కాలేజీల్లో చదువులు కొనసాగించడానికి ఒకే చెప్పాయి. దీనిపై ఉక్రెయిన్-భారత వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఆ దేశాల్లో వైద్య విద్య ఖర్చులు మరింత భారంగా ఉంటాయని తెలిపారు. దీనికి తోడు విద్యార్థులకు స్థానిక భాష తెలియదనీ, ఇది రోగులకు చికిత్స చేయకుండా నిరోధిస్తుందని పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్లోని ఖార్కివ్లో 4 సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి ఆదిత్య భరద్వాజ్ మాట్లాడుతూ.. "మమ్మల్ని స్వదేశానికి తీసుకురావడం ద్వారా ఇప్పటికే మాకు చాలా సహాయం చేసినందున మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. మమ్మల్ని తీసుకువచ్చినందుకు మేము ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా భవిష్యత్తు డైలమాలో ఉంది ప్రభుత్వ మమ్మల్ని ఆదుకోవాలి" అని అన్నారు.