
వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ అఖిల భారతీయ సంత్ పరిషత్ ఇన్ఛార్జ్ యతి సత్యదేవానంద సరస్వతి తాజాగా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోని ముబారక్పూర్లో జరిగిన మొదటి రోజు ధరం సన్సద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హిందువులు తమ కుటుంబాలను, మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని సూచించారు. ‘‘ దేశంలో పెరుగుతున్న ముస్లింల జనాభా హిందువుల క్షీణతను సూచిస్తోంది. హిందువులు తమ కుటుంబాలను బలోపేతం చేయాలి. హిందువులందరూ కుటుంబాలను, మానవత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలి ’’ అన్నారు.
హిందూ సమాజం నిరంతరం క్షీణిస్తోందని యతి సత్యదేవానంద సరస్వతి అన్నారు. ఒకప్పుడు అమర్నాథ్, మాతా వైష్ణో దేవి యాత్రపై ముస్లిం సమాజం రాళ్లతో కొట్టిందదని తెలిపారు. దుర్గాష్టమి రోజున దేశవ్యాప్తంగా ఊరేగింపుగా వెళ్లేవారిపై రాళ్లదాడి, దాడులు మొదలయ్యాయని ఆయన చెప్పారు. హిందూ సమాజానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హిందువులు మెజారిటీగా ఉన్నందున భారతదేశం ప్రజాస్వామ్య దేశమని అన్నారు. ముస్లింలు ప్రణాళికాబద్ధంగా చాలా మంది పిల్లలకు జన్మనిస్తూ తమ జనాభాను పెంచుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలోని ముబారక్పూర్లో అఖిల భారతీయ సంత్ పరిషత్ ‘ధరం సన్సద్’ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
మొదటి రోజు సమావేశంలో యతి సత్యదేవానంద్ చేసిన వ్యాఖ్యలపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు స్పందించారు. ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ సమావేశంలో ఏ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే పదజాలం ఉపయోగించరాదని ఆదేశించారు. ఈ సమావేశంలో యతి నరసింహానంద, అన్నపూర్ణ భారతితో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సాధువులు, అర్చకులు పాల్గొన్నారు.