
తమిళనాడులో మహాబలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహాబలిపురం సమీపంలోని మనమై గ్రామం వద్ద స్టేట్ రోడ్వేస్ బస్సు, ఆటో డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా ఆటోలోని వారే. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వివరాలు.. బాధిత కుటుంబం కరపాక్కం నుండి ఆటోలో చెన్నైకు తిరిగివస్తుంది. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో ఈస్ట్ కోస్ట్ రోడ్లోని మనమై గ్రామం వద్ద చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్తున్న స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎస్ఈటీసీ) బస్సును ఢీకొట్టింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ఆటో డ్రైవర్ గోవిందన్, అతని తల్లి, భార్య, కూతురు, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు మనవరాళ్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మామల్లపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.