
ఉత్తరప్రదేశ్లో కొందరు వ్యక్తులు నడి రోడ్డు మీద బిర్యానీ ఉన్న పెద్ద పాత్రతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారు బిర్యానీని ఎందుకలా దొంగిలించారు? అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాలు.. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మున్సిపల ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు (మే 4) జరుగుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయవతితో పాటు పలువురు ప్రముఖులు ఈరోజు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఇలాంటి సమయంలో బిర్యానీ చోరీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మడియాలో వైరల్గా మారింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మీరట్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత బిర్యానీ పంపిణీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. మీరట్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సమీపంలో బిర్యానీ వడ్డిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు ఐదుగురు వ్యక్తులతో కూడిన బృందం బిర్యానీ డెగ్చీ (పెద్ద కంటైనర్) పట్టుకుని దానితో అక్కడి నుంచి పరుగెత్తినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు విచారణ జరుపుతున్నారు.
మీరట్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు బిర్యానీ పంపిణీ చేసినట్టుగా పలు వార్తా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో కార్లిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. యూపీ మున్సిపల్ ఎన్నికల రెండో మే 11న జరగనుంది. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.