
ఖతార్ లోని దోహా ఎయిర్ పోర్టులోని లగ్జరీ స్టోర్ లో షాపింగ్ చేసి, వారికి డబ్బులు చెల్లించేందుకు భారత కరెన్సీని ఉపయోగించగలిగానని సింగర్ మికా సింగ్ బుధవారం ట్విట్టర్ లో తెలిపారు. మన డబ్బును డాలర్లలా వాడుకునే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి సెల్యూట్ చేశారు. బుధవారం ఉదయం పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కు 4 లక్షలకు పైగా వ్యూవ్స్, 13 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ట్విటర్ యూజర్లు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, ఆన్ లైన్ ఈ విషయాన్ని షేర్ చేసినందుకు మికా సింగ్ ను అభినందించారు.
‘‘గుడ్ మార్నింగ్.. నేను దోహా ఎయిర్ పోర్లులో ఓ స్టోర్ లో షాపింగ్ చేసేటప్పుడు భారతీయ రూపాయలను ఉపయోగించగలిగినందుకు నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. మీరు ఏ రెస్టారెంట్లోనైనా రూపాయిలను ఉపయోగించవచ్చు. అది అద్భుతం కాదా? మన డబ్బును డాలర్ల మాదిరిగా ఉపయోగించడానికి వీలు కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ సాబ్ కు భారీ సెల్యూట్’’మికా సింగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
వామ్మో.. చైనాలో అరుదైన హెచ్3ఎన్8 బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ తో తొలి మానవ మరణం నమోదు..
అయితే ఆయన ట్వీట్ పై యూజర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘భారత కరెన్సీ బలపడుతోంది’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘పవర్ ఆఫ్ న్యూ ఇండియా’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. మరికొందరు యూజర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సింగర్ ట్వీట్ కు థంబ్స్ అప్ వేస్తూ.. పలు ఎమోజీలను షేర్ చేశారు.
కాగా.. ఖతార్ తో పాటు దుబాయ్ డ్యూటీ ఫ్రీ కూడా భారత కరెన్సీ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తోంది. 2019 జూలై 1వ తేదీ నుంచి ఈ కొత్త నియమం ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ 1, 2, 3, అలాగే అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని అమ్మకాల పాయింట్ల వద్ద కరెన్సీని స్వీకరిస్తారు. అయితే కస్టమర్లకు రూపాయిల్లో కాకుండా యూఏఈ దిర్హమ్స్ లో చిల్లరను తిరిగి ఇస్తారు.
2022 లో బిజినెస్ ఇన్సైడర్ భారతీయ కరెన్సీ ఆమోదించబడిన దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు, జింబాబ్వే ఉన్నాయి. అయితే ప్రతీ దేశానికి భారతీయ కరెన్సీ డినామినేషన్లను ఉపయోగించడానికి దాని సొంత నియమం, పరిమితి ఉంది. ఇటీవల భారతదేశం డిజిటల్ పేమెంట్ టెక్నాలజీ యూపీఐ థాయ్ లాండ్, సింగపూర్ వంటి దేశాలలో ఆమోదం పొందింది. ఫిబ్రవరిలో ఇరు దేశాలు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఇదిలా ఉండగా.. జనవరిలో యూపీఐ లావాదేవీలు దాదాపు రూ.13 లక్షల కోట్ల విలువైన 8 బిలియన్ లావాదేవీల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే యుపీఐని అంతర్జాతీయంగా ఉపయోగించేందుకు వీలుగా ప్రభుత్వం అనేక ఇతర చర్యలు కూడా తీసుకుంది. జీ-20 దేశాల సందర్శకులు భారతదేశంలో షాపింగ్ చేసే సమయంలో యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించబడతారని ఆర్బీఐ ప్రకటించింది. మరో 10 దేశాల్లోని భారతీయులు ఏప్రిల్ 30 నుంచి యూపీఐ యాక్సెస్ చేసుకోవచ్చని గత నెలలో ప్రభుత్వం తెలిపింది.