
Karnataka: వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం నాడు మైసూరు జిల్లాలోని తన స్వగ్రామం సిద్ధరామహుండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ తాను రాజకీయాల్లోనే ఉంటాను. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే చివరి సారి పోటీ చేసే ఎన్నికలని అన్నారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) లేదా జెడి (ఎస్) మూడు ప్రధాన రాజకీయ పార్టీలు -- ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో సిద్దరామయ్య ప్రకటించడం గమనార్హం.
అయితే.. సిద్దరామయ్య ఇలాంటి ప్రకటన చేయడం మొదటిసారేం కాదు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇవే నా చివరి ఎన్నికలని చెప్పారు. అలాగే.. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తన చివరి ఎన్నికలని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. సోనియా గాంధీ నేతృత్వంలోని పార్టీ జాతీయ పునరుద్ధరణ కోసం కర్ణాటకపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పని తీరుపై సిద్ధరామయ్య ప్రకటనలు ప్రభావం చూపే అవకాశం ఉంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు సిద్ధరామయ్య, డికె శివకుమార్ లు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారులుగా నిలిచే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో .. పంజాబ్లో ప్రకటించినట్లుగా.. 2023 ఎన్నికలలోపు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని మీరు అడుగుతారా? అని సిద్ధరామయ్య ను ప్రశ్నించగా.. “నేను అలాంటివి అడగను. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాను. అని అన్నారు.
ఇంకా.. 2023లో ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని ఎంచుకోలేదని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వరుణ, హున్సూరు, చామరాజ్పేట, బాదామి, కోలార, హెబ్బాళ, కొప్పాల, చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేయమని అడిగారని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
తాను పోటీ చేసే ఏ స్థానం నుంచైనా విజయం సాధిస్తాననీ, రాష్ట్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వస్తుందని అన్నారు. గత ఎన్నికల్లో చాముండేశ్వరిలో ఓటమి పాలైనందున తాను పోటీ చేయనని సిద్ధరామయ్య చెప్పారు