
communal violence: దేశంలో ఇటీవల జరిగిన విద్వేషపూరిత ప్రసంగాలు మరియు మత హింసాత్మక సంఘటనలపై 13 ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. దేశంలో చోటుచేసుకుంటున్న మతపరమైన హింసాత్మక ఉద్రిక్తపరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసిందని దేశంలోని 13 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. ప్రధాని మౌనం ఈ విధమైన దాడులకు దిగే మూకలకు ఈ తీరు అధికారి ప్రోత్సాహం అందించే విధంగా ఉందంటూ ఆయా పార్టీల ఉమ్మడి ప్రకటన పేర్కొంది. శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, మత హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
దేశంలోని 13 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు భారత్ లో ప్రస్తుతం కొనసాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలు మరియు మత హింసాత్మక సంఘటనలపై ప్రధాని మోడీ తీరును ప్రస్తావిస్తూ.. ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ సంయుక్త ప్రకటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, NCP అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నాయకుడు MK స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లతో సహా చాలా మంది నేతలు మత సంబంధిత ఉద్రిక్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆహారం, వేషధారణ, విశ్వాసం, పండుగలు మరియు భాష సమాజాన్ని ధ్రువీకరించడానికి పాలక వ్యవస్థ ద్వారా కొనసాగుతున్న చర్యలు ఆందోళనకరమైనవని పేర్కన్నారు.
“మతోన్మాదాన్ని ప్రచారం చేసే వారు వారి మాటలు మరియు చర్యల ద్వారా మన సమాజాన్ని రెచ్చగొట్టే వారికి వ్యతిరేకంగా మాట్లాడడంలో విఫలమైన ప్రధానమంత్రి మౌనం పట్ల మేము ఆశ్చర్యపోయాము. ఇలాంటి ప్రైవేట్ సాయుధ మూకలు అధికారిక ప్రోత్సాహంతో విలాసాన్ని అనుభవిస్తున్నాయనడానికి ఈ మౌనమే నిలువెత్తు నిదర్శనం’’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.“శతాబ్దాలుగా భారతదేశాన్ని నిర్వచించిన మరియు సుసంపన్నం చేసిన సామాజిక సామరస్య బంధాలను బలోపేతం చేయడానికి కలిసి పని చేయాలనే తమ సమిష్టి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ.. మన సమాజంలో విభజనను పెంచడానికి ప్రయత్నిస్తున్న విషపూరిత భావజాలాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్ష నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము" అని 13 ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటన పేర్కొంది.
“శాంతిని కాపాడాలని, మతపరమైన ధ్రువణాన్ని పదును పెట్టాలనుకునే వారి చెడు లక్ష్యాన్ని విఫలం చేయాలని మేము అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న మా పార్టీ యూనిట్లన్నింటికీ స్వతంత్రంగా మరియు ఉమ్మడిగా శాంతి మరియు సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని మేము పిలుపునిస్తున్నాము”అని ఉమ్మడి ప్రకటన పేర్కొంది. ‘దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన మత హింసాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత ఘటనలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సాయుధ మతపరమైన ఊరేగింపులు, రెచ్చగొట్టే ప్రసంగాలు… మతపరమైన హింసకు దారితీస్తున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. మతోన్మాదాన్ని ప్రచారం చేయడం, సమాజాన్ని రెచ్చగొట్టే వారి మాటలు, చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడడంలో విఫలమైన ప్రధాన మంత్రి మౌనం పట్ల మేం దిగ్భ్రాంతి చెందుతున్నాం అని పేర్కొన్నారు. కాగా, ఈ నెలలో నిర్వహించిన రామనవమి, హనుమాన్ జయంతి ర్యాలీల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.