కాంగ్రెస్‌కు పనికిరాని వాడు.. కాషాయానికి ప్లస్ అవుతాడా, జీతిన్ రాకపై సంబరాలెందుకు: బీజేపీకి శివసేన చురకలు

Siva Kodati |  
Published : Jun 11, 2021, 04:49 PM IST
కాంగ్రెస్‌కు పనికిరాని వాడు.. కాషాయానికి ప్లస్ అవుతాడా, జీతిన్ రాకపై సంబరాలెందుకు: బీజేపీకి శివసేన చురకలు

సారాంశం

కాంగ్రెస్ యువనేత జీతిన్ ప్రసాద బీజేపీలో చేరడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆయన నిష్క్రమణపై కాంగ్రెస్‌లో జీ-23గా ముద్రపడిన అసమ్మతి నేతలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీజేపీకి ఒకప్పటి మిత్రపక్షం శివసేన.. జీతిన్ ప్రసాద వ్యవహారంపై స్పందించింది. 

కాంగ్రెస్ యువనేత జీతిన్ ప్రసాద బీజేపీలో చేరడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆయన నిష్క్రమణపై కాంగ్రెస్‌లో జీ-23గా ముద్రపడిన అసమ్మతి నేతలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీజేపీకి ఒకప్పటి మిత్రపక్షం శివసేన.. జీతిన్ ప్రసాద వ్యవహారంపై స్పందించింది. కాంగ్రెస్‌కు పనికిరాని వాడు బీజేపీకైనా అంతేనంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయాన్ని ప్రచురించింది. జితిన్ రాకపై బీజేపీ సంబరాలు చేసుకుంటోందంటూ చురకలు అంటించింది. అతన్ని కేవలం యువ నాయకుడిగానే చూడాలని బీజేపీకి హితవు పలికింది. 

జీతిన్ ప్రసాద, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్‌లు యువ నాయకులని వారిపై ఎన్నో అంచనాలు వున్నాయని శివసేన తెలిపింది. అహ్మద్ పటేల్, రాజీవ్ సాతావ్ వంటి సీనియర్లు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని శూన్యం ఆవరించిందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో హస్తం పార్టీలోని యువ నాయకులు బీజేపీలోకి  వెళ్లడం మంచిది కాదని ఆ సంపాదకీయంలో ప్రచురించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రసాద బీజేపీలో చేరారని, కానీ ప్రసాద కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌కు విధేయులని గుర్తుచేసింది. 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో జీతిన్ ప్రసాద మంత్రిగా వున్నారని శివసేన వెల్లడించింది. తర్వాత జరిగిన లోక్‌సభ, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జీతిన్ ప్రసాద ఓడిపోయారని.. అలాంటి వ్యక్తి బీజేపీలోకి రావడాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే దీని వెనుక ఉత్తరప్రదేశ్ కుల రాజకీయాలు వున్నాయంటూ ఎత్తి చూపింది. యూపీ బ్రాహ్మణ ఓటు బ్యాంక్‌పై బీజేపీ కన్ను వేయడం వల్లనే జీతిన్ కాషాయ గూటికి చేరుకున్నారంటూ వ్యాఖ్యానించింది. ప్రసాదకు బ్రాహ్మణ ఓట్లపై పట్టు వుంటే.. ఈ ఓట్లను కాంగ్రెస్‌కు ఎందుకు బదిలీ చేయలేదంటూ శివసేన ప్రశ్నించింది. 

Also Read:యూపీ ఎన్నికలు: బ్రాహ్మణులే టార్గెట్, బీజేపీ వ్యూహం.. జీతిన్ ప్రసాదకు మంత్రి పదవి..?

సాంప్రదాయ ఉన్నత కులాల ఓట్లు పార్టీకి దూరమవుతుండటమే బీజేపీ ఆందోళనకు కారణమని ఎద్దేవా చేసింది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలవడానికి ప్రధాని మోడీ, రామ్ మందిర్, హిందుత్వం దోహదపడ్డాయని.. కానీ ఇప్పుడు వాటికి విలువ లేకపోవడంతో పరిస్ధితి ఘోరంగా వుందని అందుకే జీతిన్ ప్రసాద మద్ధతు కోరుకుంటుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 

అసలు కాంగ్రెస్ నాయకులు బీజేపీ గూటికి ఎందుకు చేరుకుంటున్నారన్న శివసేన.. జ్యోతిరాధిత్య సింధియా ఫిరాయింపు, సచిన్ పైలట్ తిరుగుబాటుపై వ్యాఖ్యలు చేసింది. అటు పంజాబ్ కాంగ్రెస్‌‌లోనూ తిరుగుబాటు వుందని సామ్నాలో తెలిపింది. తిరుగుబాటులు, కక్షసాధింపులు కాంగ్రెస్‌కు పరిమితం కాదని పేర్కొంది. పార్టీని పునరుద్దరించడానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం బలమైన బృందాన్ని సృష్టించాల్సిన అవసరం వుందని రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమం, తర్వాత కూడా కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసిందని శివసేన ప్రశంసించింది. నేటికీ నెహ్రూ - గాంధీ కృషిని భారతదేశ స్మృతిపథం నుంచి నిర్మూలించలేమని.. అయితే కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ వుందని తెలిపింది. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా తానెంటో నిరూపించుకున్నారని.. ఇప్పుడు రాహుల్ వైపే అందరి చూపు వుందని శివసేన అభిప్రాయపడింది. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu