
Congress : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఆదివారం ఉదయపూర్లో 3 రోజుల చింతన్ శివిర్లో చివరి రోజు కోసం పార్టీ సిద్ధమవుతున్నప్పుడు రాజకీయ కమిటీలోని కొంతమంది సభ్యుల గ్రూప్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అనేక అభిప్రాయాలు ఉద్వేగభరితమైన చర్చల తర్వాత సామరస్యపూర్వక పరిష్కారాలు కనుగొనబడ్డాయని తెలిపారు. ఈ చర్చలు పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి బలమైన ఉదాహరణ అని శశి థరూర్ అన్నారు. థరూర్ మహిళా కాంగ్రెస్ ప్రతినిధులతో ఉన్న ఫోటోను మరియు దేశవ్యాప్తంగా అనేక ఇతర పార్టీ సహచరులతో ఉన్న ఇతర ఫోటోలను ట్వీట్ చేశారు.
ట్విట్టర్ లో శశి థరూర్.. ‘‘గత రాత్రి మా చర్చలు వాయిదా పడిన తర్వాత రాజకీయ సంఘం కొందరు సభ్యులం గ్రూప్ ఫొటో కోసం కలిశాం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి గొప్ప ఉదాహరణ ఈ చర్చలు. అభిప్రాయాలపై నిశితంగా చర్చించాం, సామరస్యపూర్వక పరిష్కారాలు లభించాయి’’ అని ఓ ట్వీట్ చేశారు.
మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి తాను తీయించుకున్న ఫొటోను మరొక ట్వీట్లో శశి పోస్ట్ చేశారు. నవ సంకల్ప చింతన్ శివిర్ వద్ద మహిళా కాంగ్రెస్ ప్రతినిధుల గ్రూప్ సెల్ఫీకి తనను ఆహ్వానించారని తెలిపారు. చింతన్ శివిర్ కు వైవిద్ధ్యభరితమైన వ్యక్తులు వచ్చారని, ఇది చాలా గొప్ప విషయమని వెల్లడించారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పార్టీ సహచరులను కలుసుకునేందుకు ఓ అద్భుతమైన అవకాశం లభించిందని చెప్పారు. పళ్లంరాజు, జిగ్నేశ్ మేవానీ, మణిశంకర్ అయ్యర్ వంటి మిత్రులను కలుసుకున్నట్లు పేర్కొన్నారు.
కాగా, రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పార్టీని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ మూడు రోజుల మేధోమథనం సెషన్ 'చింతన్ శివిర్'ను నిర్వహిస్తోంది. అయితే, కాంగ్రెస్ చింతన్ శివిర్లో పార్టీకి కాబోయే అధ్యక్షుడి పేరు ఖరారవుతుందని భావిస్తున్నారు. రాహుల్ మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అనూహ్యంగా మరోవైపు ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయాలనే డిమాండ్ రావడం గమనార్హం.