
న్యూఢిల్లీ: జామియా హింస కేసులో స్టూడెంట్ యాక్టివిస్ట్ షర్జీల్ ఇమామ్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఢిల్లీలోని ఓ కోర్టు ఈ కేసులో విద్యార్థి కార్యకర్తలు షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలను నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. 2019లో జామియా నగర్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో అదనపు సెషన్స్ జడ్జీ అరుల్ వర్మ ఈ తీర్పు వెలువరించారు. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నది.
ఈ కేసులో షర్జీల్ ఇమామ్ నిర్దోషిగా తేలినప్పటికీ జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎందుకంటే షర్జీల్ ఇమామ్ పై 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసు ఉన్నది. ఢిల్లీ అల్లర్ల కుట్రలో ఆయన నిందితుడిగా ఉన్నాడు. అల్లర్లు, మతపరమైన హింస వంటి ఆరోపణలతో ఐపీసీ కింద పలు సెక్షన్ల కింద ఆయన పై కేసులు ఉన్నాయి. ఈ ప్రేరేపణలతో పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగినట్టు అభియోగాలు నమోదయ్యాయి.
Also Read: Sharjeel Imam Case: హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు.. ఏం జరిగిందంటే?
పౌరసత్వ (సవరణ) చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఇమామ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని పోలీసులు ఆరోపించిన తర్వాత ఇమామ్పై దేశద్రోహ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. జనవరి 28, 2020న బీహార్లో అరెస్టయ్యాడు. ఫిబ్రవరి 2020లో ఢిల్లీలో చెలరేగిన మతపరమైన అల్లర్లను ప్లాన్ చేయడానికి సంబంధించి ఆరోపించిన కుట్రకు సంబంధించి కూడా అతనిపై కేసు నమోదు చేయబడింది.