న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కూడ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో తాను ప్రసంగిస్తానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.77వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారత పౌరులను కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ వచ్చే ఏడాది ఇదే స్థలం నుండి తాను ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొంటానని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇదే ఎర్రకోట నుండి దేశం సాధించిన ప్రగతి జాబితాను వివరిస్తానని మోడీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది కూడ ఎర్రకోట నుండి ప్రసంగిస్తానన్నారు. మరింత ఆత్మవిశ్వాసంతో దేశాభివృద్ది గురించి మాట్లాడుతానని ఆయన వ్యాఖ్యానించారు. తన పనితీరు తనను మరోసారి ఒక్కడికి తీసుకు వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లు అపూర్వమైన అభివృద్ధిని సాధించనున్నట్టుగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. 2014లో మార్పు తీసుకువస్తానని మోడీ వాగ్ధానం చేశారు. మీరు తనపై నమ్మకం ఉంచారు, మీరు ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించినట్టుగా తెలిపారు. గత ఐదేళ్లలో తాను చేసిన వాగ్ధానాలు తనలో విశ్వాసాన్ని నింపాయన్నారు. దేశం కోసం కష్టపడి పనిచేసినట్టుగా చెప్పారు. గర్వంగా పనిచేసినట్టుగా మోడీ వివరించారు.ఇవాళ ఎర్రకోటపై ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై మోడీ ధీమాను వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ వ్యాఖ్యలపై ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.