
దేశం మొత్తం స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘భారత మాత’ ప్రతీ భారతీయుడి గొంతుక అని అన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన చేపట్టిన 145 రోజుల భారత్ జోడో యాత్ర గురించి, ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘‘నా ప్రేమ వస్తువు హఠాత్తుగా బయటపడింది. నా ప్రియమైన భరతమాత భూమి కాదు. అది ఆలోచనల సమాహారం కాదు. అది ఒక ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర లేదా మతం కాదు. వ్యక్తులకు కేటాయించిన కులం కూడా కాదు. భారతదేశం ఎంత బలహీనంగా ఉన్నా, బలంగా ఉన్నా ప్రతి ఒక్క భారతీయుడి గొంతుక. అన్ని స్వరాల్లో దాగి ఉన్న ఆనందం, భయం, బాధ భారత్ ’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘భారతదేశం వినాలంటే నా స్వరం - నా కోరికలు - నా ఆశయాలు నిశ్శబ్దంగా ఉండాలి. భారతదేశం తన సొంత వారితో మాట్లాడుతుంది, కానీ ఒకరు వినయంగా, పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటేనే’’ అని రాహుల్ గాంధీ అన్నారు. యాత్రలో తన అనుభవాలను పంచుకుంటూ.. ‘‘ఇది ఎంత సింపుల్ గా సాగింది. సముద్రంలో మాత్రమే దొరికే దాని కోసం నదిలో వెతుకుతున్నాను.’’ పర్షియన్ కవి రూమీ చెప్పిన మాటలను ఉదహరిస్తూ.. ‘‘హృదయం నుండి మాటలు వస్తే అవి హృదయంలోకి ప్రవేశిస్తాయి’’ అని తెలిపారు.
తన యాత్ర ప్రారంభించిన వెంటనే కనిపించిన పాత గాయం, అలాగే తన మోకాలి నొప్పి గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కానీ ప్రజల సంఖ్య పెరగడంతో, వారి శక్తిని పొందడం వల్ల తన నొప్పి తగ్గిందని తెలిపారు. ‘‘అప్పుడు నేను ఒక విషయం గమనించడం మొదలుపెట్టాను. ఆపడం గురించి ఆలోచించిన ప్రతిసారీ, వదులుకోవాలని ఆలోచించిన ప్రతిసారీ, ఎవరైనా వచ్చి నాకు కొనసాగే శక్తిని బహుమతిగా ఇచ్చేవారు’’ అని ఆయన అన్నారు.
‘‘ఒక నిశ్శబ్ద శక్తి నాకు సహాయం చేస్తున్నట్లు అనిపించింది. చీకటి అడవిలోని నిప్పురవ్వల వలె, అది ప్రతిచోటా ఉంది. నాకు నిజంగా అవసరమైనప్పుడు అది సహాయం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒక రోజు నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని నిశ్శబ్దాన్ని అనుభవించాను. నా చెయ్యి పట్టుకుని నాతో మాట్లాడుతున్న వ్యక్తి గొంతు తప్ప మరేమీ వినపడలేదు. చిన్నప్పటి నుంచి నాతో మాట్లాడిన అంతర్గత స్వరం పోయింది. ఏదో చచ్చిపోయినట్లు అనిపించింది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.