
communal clashes:రాజస్థాన్లో మత ఘర్షనలు చోటుచేసుకున్నాయి. పదులు సంఖ్యలో మంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులు మరింతగా దిగజారకుండా ప్రభుత్వం 144 సెక్షన్ ను విధించింది. గాయపడిన వారిని వైద్యం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని కరౌలి జిల్లాలో మతపరమైన ఊరేగింపు కొనసాగుతుండగా.. పలువురు దుండగులు రాళ్లు రువ్వారు. ఇలా రెండు వర్గాల మధ్య మత ఘర్షణలకు దారి తీసింది. ఇది మరింతగా మారి ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ హింసాత్మక ఘటనను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే, కర్ఫ్యూ విధించడంతో పాటు.. ఇంటర్నెట్ ను షట్డౌన్ చేశారు.
ఏప్రిల్ 2 సాయంత్రం 6:30 నుండి ఏప్రిల్ 4 ఉదయం 12 గంటల వరకు కరౌలి జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఏవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. " ఏప్రిల్ 2 సాయంత్రం 6:30 నుండి ఏప్రిల్ 4 ఉదయం 12 గంటల వరకు, మత ఘర్షణల నేపథ్యంలో నమోదైన కేసులకు సంబంధించి కరౌలిలో సెక్షన్ 144 విధించబడింది. నగరంలో 'శోభా యాత్ర' (బైక్ ర్యాలీ)పై రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 2 మరియు 3 తేదీలలో (అర్ధరాత్రి వరకు) ఇంటర్నెట్ను కూడా బంద్ చేయనున్నారు" అని కరౌలీ డిఎం రాజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
ఈ ఘటనలో చాలా మందికి గాయాలు అయ్యాయి. అయితే, తీవ్రంగా గాయపడిన దాదాపు 40 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. వారిలో 27 మంది చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. మిగతా వారు ఇంకా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ.. అక్కడి వైద్యులు జైపూర్ కు రిఫర్ చేశారు. క్షతగాత్రులను జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. కరౌలిలో మోహరించిన 50 మంది పోలీసు అధికారులతో సహా 600 మందికి పైగా పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ హవా సింగ్ ఘుమారియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరౌలీలో జరిగిన హింసాకాండకు సంబంధించి, గవర్నర్ పోలీసు డైరెక్టర్ జనరల్తో ఫోన్లో మాట్లాడారు, గవర్నర్ కల్రాజ్ మిశ్రా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంఎల్ లాథర్ను ఫోన్లో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్, పరిస్థితిని నియంత్రించడానికి తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుండి వివరణాత్మక సమాచారాన్ని తీసుకున్నారు. సంయమనం పాటిస్తూ శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని స్థానిక ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
నగరంలో అధ్వాన్నంగా మారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ వెంటనే చర్యలు తీసుకుని నగరంలో కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. కరౌలీలో జరిగిన ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వయంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి పరిస్థితిపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడిన దాదాపు రెండున్నర డజన్ల మందిని అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ శ్రీ హవా సింగ్ ఘుమారియా తెలిపారు.