
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్వర్తులను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. విద్యాసంస్థల్లో మత ప్రస్తకి ఉండరాదని తేల్చి చెప్పింది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హిజాబ్ పిటిషన్ పై న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన అత్యున్నత ధర్మాసనం 10 రోజులపాటు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్లు రాజీవ్ ధావన్, కపిల్ సిబాల్, దేవదత్ కామత్, సంజయ్ హెగ్డే, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు తమ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ నవడ్గి, ఏఎస్జీ కేఎం నటరాజ్ లు తమతమ వాదనలను వినిపించారు. ఈ క్రమంలో సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ.. నిరసనలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనవసరమైన విషయాన్ని సొలిసిటర్ జనరల్ లేవనెత్తారని వాదించారు. దీంతో సుప్రీం కోర్టు తన తీర్పును సెప్టెంబర్ 22న రిజర్వ్ చేసింది.
అయితే.. ఈ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ గుప్తా.. అక్టోబర్ 16న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేయకముందే.. కర్ణాటక హిజాబ్ వివాదంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కీలక అంశంపై ఈ వారంలో తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ కేసులో విచారణ సందర్భంగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ముస్లిం బాలికలను తరగతుల్లో హిజాబ్ ధరించకుండా నిరోధించడం వల్ల వారి చదువుకు ప్రమాదం ఏర్పడుతుందని, వారు తరగతులకు హాజరు కాకుండా నిరోధించవచ్చని పట్టుబట్టారు. అదే సమయంలో, కొంతమంది న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని అభ్యర్థించారు. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మతపరమైన తటస్థంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
కర్ణాటక హైకోర్టు ఏమన్నాదంటే..?
ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ బాలికల కళాశాలలో తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముస్లిం బాలికలు దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మార్చి 15న కొట్టివేసింది. అదే సమయంలో, ఇస్లాంలోని తప్పనిసరి మతపరమైన ఆచారంలో హిజాబ్ భాగం కాదని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.