
దేశంలో మహిళల కనీస వివాహ వయసు 18 ఏండ్లుగా ఉండేది. అయితే దీన్ని 18 నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందే. ఈ అంశానికి సంబంధించి బిల్లును సిద్ధం చేసి ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదముద్ర వేయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ నిర్ణయాన్ని సమాజ్ వాదీ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా.. ఈ నిర్ణయాన్ని మరో సమాజ్ వాదీ నేత సయ్యద్ తుఫైల్ హసన్ వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు.
సయ్యద్ తుఫైల్ హసన్ మీడియాతో మాట్లాడుతూ.. 'అమ్మాయిలకు పునరుత్పత్తి వయసు రాగానే పెళ్లి చేయాలి. ఆడవారి పునరుత్పత్తి వయస్సు 16-17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. 16 ఏళ్ల వయసు నుంచే పెళ్లి ప్రతిపాదనలు వస్తున్నాయి. వివాహం ఆలస్యమైతే.. రెండు నష్టాలు ఉన్నాయి. 1. సంతానోత్పత్తి భయం, 2. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చే వరకు స్థిరపడలేరు. లేట్ మ్యారేజ్ చేసుకుంటే.. తల్లిదండ్రులు వృద్దాప్యానికి వచ్చేవరకు పిల్లలు ఇంకా చదువుతున్నారు. ఇలా చేయడం ద్వారా సహజ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము. అమ్మాయికి పునరుత్పత్తి వయస్సు రాగానే ఆమె వివాహం చేసుకోవాలి. 18 ఏళ్లకే ఓటు వేయగా లేనిది.. 18 ఏళ్లకే పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? " అని ప్రశ్నించారు.
Read Also: ఒమిక్రాన్ వేరియంట్ను స్పుత్నిక్ వీ సమర్థంగా ఎదుర్కొంటుంది.. రష్యా ప్రభుత్వం
నిన్న సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఎంపీ షఫీకుర్ రెహమాన్ బర్క్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ చాలా పేద దేశమని, ఈ దేశంలో ప్రతి తల్లీతండ్రీ తమ బిడ్డలకు తొందరగానే వివాహం చేయాలని కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల వివాహ వయసు పెంపునకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాము మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు.
Read Also : నాటు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లి.. మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం.. ఆరోగ్యం క్షీణించడంతో...
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. తమ పార్టీ అభ్యుదయవాదమని, మహిళలు, బాలికల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రారంభించామని అఖిలేష్ అన్నారు. ఇలాంటి ప్రకటనలతో సమాజ్వాదీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.