
న్యూఢిల్లీ: పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) జాతీయ పార్టీలు సహా అన్నింటినీ ఆప్(AAP) ఊడ్చేసింది. చరిత్ర సృష్టిస్తూ తొలిసారి పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. పంజాబ్లోని మొత్తం 117 స్థానాల్లో 92 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆప్ తరఫున గెలిచిన అభ్యర్థుల్లో నరీందర్ కౌర్ భరాజ్ కూడా ఉన్నారు. పంజాబ్లోని సంగ్రూర్ నియోజకవర్గం నుంచి నరీందర్ కౌర్ భరాజ్ గెలుపొందారు. ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీ దళ్ తరఫున బరిలోకి దిగిన క్యాండిడేట్ మాత్రం ఓటమి చవిచూశాడు. ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచినా.. ఆయన విన్నర్గానే ఉన్నారు. ట్విట్టర్లో నెటిజన్లు ఆయన పేరును పేర్కొంటూ విన్నర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
సంగ్రూర్ నుంచి పోటీ చేసిన శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి పేరు విన్నర్జీత్ సింగ్ గోల్డీ(Winnerjit Singh Goldy). ఆయన పేరులో విన్నర్, జీత్లు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పేరులో విన్నర్ ఉన్నది కదా.. అందుకే నెటిజన్లు ఆయన ఓడినా.. విన్నరే అని ఛమత్కారాలు చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన పేరులోని ఇంగ్లీష్ పదం విన్నర్ అన్నా.. హిందీలో జీత్ అన్నా.. గెలుపే. దీంతో ఆయన ఓడినా.. విన్నరే అని ట్వీట్లు చేస్తున్నారు.
పంజాబ్ ప్రజలు ఇంగ్లీష్ పేర్లను ఇష్టపడతారా? విన్నర్జీత్ అని పేరు పెట్టడం అరుదు అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. మరొక యూజర్.. విన్నర్.. జీత్.. అయినప్పటికీ ఓడిపోయాడు అంటూ పేర్కొన్నాడు.
ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం, విన్నర్జీత గోల్డీ 10,488 ఓట్లు గెలుచుకున్నారు. కాగా, ఆప్ అభ్యర్థి నరీందర్ కౌర్ భరాజ్ 74,851 ఓట్లు సాధించుకుని సంగ్రూర్ నుంచి విజయఢంకా మోగించారు. 51.67 శాతం ఓట్లు ఆయన కైవసం చేసుకున్నారు. విన్నర్జీత్ సింగ్ గోల్డీ మంచి హార్డ్ వర్కర్ అని రాష్ట్ర మాజీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ దల్జీత్ ఎస్ చీమా ఓ సారి అన్నారు. డిసెంబర్ 4వ తేదీనే విన్నర్జీత్ సింగ్ గోల్డీని ఈ సీటు నుంచి బరిలోకి దింపనున్నట్టు అకాలీ దళ్ అపాయింట్ చేసింది.
ఇదిలా ఉండగా, పంజాబ్కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని వ్యాఖ్యానించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ . ప్రజలకు నిజాయతీతో కూడిన పాలనను అందిస్తామని పంజాబ్ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం అమృత్సర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు.