నెలకు రూ.100 కోట్లు ఇవ్వాలన్నాడు: హోం మంత్రిపై ముంబై మాజీ సీపీ ఆరోపణలు

By Siva KodatiFirst Published Mar 20, 2021, 8:55 PM IST
Highlights

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో వున్న కారు వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కేసులో స్కార్పియో ఓనర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించగా, పోలీస్ అధికారి సచిన్ వాజేను అదుపులోకి తీసుకున్న ఘటనలతో ఈ వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. 

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో వున్న కారు వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కేసులో స్కార్పియో ఓనర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించగా, పోలీస్ అధికారి సచిన్ వాజేను అదుపులోకి తీసుకున్న ఘటనలతో ఈ వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు.

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో అరెస్టెయిన వాజేను నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ సూచించారంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు పరంబీర్‌ సింగ్‌ లేఖ రాశారు. అంబానీ కేసులో విచారణ సరిగా చేపట్టని కారణంగా బదిలీ అయిన కొద్ది రోజులకే ఆయన ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:అంబానీ ఇంటి వద్ద కారు కలకలం కేసు: ముంబై సీపీపై వేటు.. ఎన్ఐఏ చేతిలో కీలక ఆధారాలు

ముంబయి క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ హెడ్‌గా ఉన్న వాజేను హోంమంత్రి దేశ్‌ముఖ్‌ కొన్ని నెలలుగా పలుమార్లు తన నివాసానికి పిలిపించుకున్నారని పరంబీర్‌ లేఖలో ప్రస్తావించారు.

తన కోసం నిధులు తీసుకురావాలని వాజేను పదేపదే ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ విధంగా నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. ఆ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని పరంబీర్‌ ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా కీలక నేతలతో సీఎం ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఉద్దవ్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

click me!