
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు మంగళవారం బెంగళూరు నుంచి న్యూఢిల్లీకి బయల్దేరారు. అయితే సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బుధవారం విమానంలో తాను, తన తల్లి ఎదుర్కొన్న పరిస్ధితులను వివరించారు. అలాగే సోనియా గాంధీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి విమానంలో కూర్చొన్నట్లు కనిపించింది.
జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరయ్యారు. భేటీ ముగిసిన అనంతరం వీరిద్దరూ బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. ఈ క్రమంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని భోపాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలెట్లు. విపక్ష సమావేశంలో శోభా ఓజాతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో విమానాశ్రయానికి చేరుకున్న సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను పరామర్శించారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన తర్వాత గాంధీలు రాత్రి 9.30 గంటలకు ఇండిగో విమానంలో న్యూఢిల్లీకి తిరిగి వెళ్లారు.
కాగా.. వచ్చే లోక్ సభ ఎన్నికలకు పోరాటానికి వేదికలు ఖరారైనట్టుగా కనిపిస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలు ఎన్డీయే వర్సెస్ ఇండియాగా రెండు పక్షాల మధ్య ద్విముఖ పోరు జరిగేలా కనిపిస్తున్నది. అధికార ఎన్డీయేను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదికి వచ్చాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆప్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ సహా 26 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. గత యూపీఏలోని పార్టీలకు తోడు మరిన్ని పార్టీలు వచ్చి కూటమిలో చేరడంతో దీని పేరు మార్చారు. దాన్ని ఇండియా(INDIA-Indian National Developmental Inclusive Alliance)గా నామకరణం చేశారు. అన్ని పార్టీల మధ్య సమన్వయం కోసం 11 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం, ప్రతిపక్షాలు ఐక్య ప్రకటన చేశాయి. ఆ ప్రకటన కీలకంగా ఉన్నది.
సామూహిక సంకల్పం పేరిట విడుదల చేసిన ఈ ప్రకటనలో భారత రాజ్యాంగం సూచించిన విలువల భారత దేశ ఆత్మను కాపాడుకోవడానికి సమాయత్తం కావాలని తామంతా నిర్ణయించుకున్నట్టు ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. గణతంత్ర దేశాన్ని బీజేపీ ఒక క్రమపద్ధతిలో తీవ్రంగా నష్టపరుస్తున్నదని తెలిపాయి. ప్రస్తుతం దేశ చరిత్రలోనే మనం ఒక సంక్లిష్ట సమయంలో ఉన్నామని వివరించాయి. భారత రాజ్యాంగానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, సమాఖ్యతలపై పద్ధతిగా దెబ్బతీస్తున్నదని ఆరోపించాయి.