సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆ సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, తన ఖాతాను నిలిపివేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు.
తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. ఇది పూర్తి పక్షపాత చర్యగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన రాహుల్ గాంధీ ఇలా అన్నారు. ‘‘ తన ట్విట్టర్ను మూసివేయడం ద్వారా , వారు తమ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక సంస్థ మన రాజకీయాలను నిర్వచించడానికి తన వ్యాపారాన్ని చేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. ఒక రాజకీయ నాయకుడిగా తనకు అది ఇష్టం లేదని ఆయన అన్నారు.
ఇది మన దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై జరిగిన దాడి అని.. ఇది కేవలం రాహుల్ గాంధీని మూసివేయడం మాత్రమే కాదని, తనకు 20 మిలియన్ల మంది ఫాలోవర్లు వున్నారని గుర్తుచేశారు. మూసివేత ద్వారా మీరు వారి అభిప్రాయాన్ని పంచుకునే హక్కును తిరస్కరించారని రాహుల్ అన్నారు. ట్విట్టర్ చర్యను పూర్తి అన్యాయమైనదిగా పేర్కొన్నారు. తటస్థంగా వుండాలనే ఆలోచనను ట్విట్టర్ ఉల్లంఘిస్తోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడటానికి అనుమతించబడటం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మీడియాను సైతం నియంత్రిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ట్విట్టర్లో తన ఆలోచనలు పంచుకోవచ్చని తాను భావించాననీ, కానీ ఈ వేదిక కూడా పక్షపాతమైనదేనని, ఇది ప్రభుత్వం చెప్పిన మాట వింటోందని రాహుల్ ఆరోపించారు.
ఒక భారతీయుడిగా నేను అడిగే ప్రశ్న ఒక్కటే.. ప్రభుత్వానికి విధేయంగా ఉంటున్నాయని కంపెనీలు మనకు రాజకీయాలు నేర్పడాన్ని అంగీకరిద్దామా? లేదా మన రాజకీయాలను మనమే నిర్వచించుకుందామా? మన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు.