కరోనా వ్యాక్సిన్ ఎగుమతులను నిలిపివేయాలని ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం నాడు లేఖ రాశాడు.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎగుమతులను నిలిపివేయాలని ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం నాడు లేఖ రాశాడు. అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా అందించడానికి టీకాల ఎగుమతులను నిలిపివేయాలని ఆయన కోరారు. టీకాల ఎగుమతి ఇలానే కొనసాగితే దేశంలో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి రోజూ దేశంలో ఎంత ఎక్కువమందికి టీకాలు అందిస్తామో అందరికీ వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు.కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నత్తల వేగంతో ముందుకు కదులుతున్నామని ఆయన ఆ లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడు నెలల్లో దేశంలో ఒక్క శాతం లోపు జనాభాకు వ్యాక్సిన్ అందించినట్టుగా ఆయన చెప్పారు.
దేశంలోని 75 శాతం మందికి వ్యాక్సిన్ వేయడానికి ఇంకా ఏడేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే భారత దేశ వ్యవస్థ తీవ్రంగా క్షీణించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశ అవసరాలకు వ్యాక్సిన్ వినియోగించకుండా ఎగుమతులు చేయడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
తమ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వల కొరత ఉందని విపక్ష పార్టీల సీఎంలు పదేపదే ప్రకటిస్తున్నారని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. టీకా ఎగుమతుల్లో కూడ ప్రజల ఖర్చుతో ప్రచారం పొందారని ఆయన మోడీపై విమర్శలు గుప్పించారు.