ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. అనర్హత వేటుపై ‘జన్‌ ఆందోళన్‌’పేరుతో కాంగ్రెస్ నిరసన..!

Published : Mar 25, 2023, 09:55 AM IST
 ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. అనర్హత వేటుపై ‘జన్‌ ఆందోళన్‌’పేరుతో కాంగ్రెస్ నిరసన..!

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై స్పందించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లానున్నట్టుగా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ మీడియా సమావేశంలో రాహుల్.. తన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై స్పందించే అవకాశం ఉంది. అలాగే తన భవిష్యత్ కార్యచరణపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, తన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన  తర్వాత ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. తాను భారతదేశ స్వరం కోసం పోరాడుతున్నానని తెలిపారు. ఇందుకోసం ఎంత వరకైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌ను సూరత్‌లోని కోర్టు గురువారం(జనవరి 23) దోషిగా తేల్చింది. 

రెండేళ్ల జైలు శిక్షను  కూడా విధించింది. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో రాహుల్‌పై లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక, ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వయానాడ్ నుంచి విజయం సాధించారు. 

ఇదిలా ఉంటే.. ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారిఖ్ అన్వర్, సీనియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సల్మాన్ సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ‘జన్‌-ఆందోళన్‌’ పేరుతో నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది.

‘‘అదానీ సమస్యపై, ప్రభుత్వ విదేశాంగ విధానంపై, సరిహద్దులో చొరబాట్లకు చైనాకు క్లీన్ చిట్ ఇవ్వడంపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు రాహుల్ గాంధీని ఉద్దేశపూర్వకంగా అనర్హులుగా ప్రకటించారు. దీనిపై తాము దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం’’ జైరామ్ రమేష్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms