ఢిల్లీ కాలుష్యం: హెల్త్ ఎమర్జెన్సీ విధింపు.. స్కూళ్లకు సెలవులు, మాస్క్‌లు తప్పనిసరి

By sivanagaprasad KodatiFirst Published Nov 1, 2019, 2:48 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో కాలుష్య నియంత్రణా మండలి ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. దీనితో పాటు నవంబర్ 5 వరకు నిర్మాణాలపైనా నిషేధం విధించింది.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో కాలుష్య నియంత్రణా మండలి ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. దీనితో పాటు నవంబర్ 5 వరకు నిర్మాణాలపైనా నిషేధం విధించింది.  మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాఠశాలల్లో చిన్నారులకు బ్రీతింగ్ మాస్క్‌లను పంచారు.

అనంతరం కేజ్రీ మాట్లాడుతూ.. రాజధాని నగరం గ్యాస్ ఛాంబర్‌గా తయారైందని.. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టడం వల్లే నగరాన్ని కాలుష్యం కప్పేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు ఇదే రకమైన పరిస్ధితి ఉంటే వాహనాలకు సరిబేసి స్కీమ్ అమలు చేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు.

ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే బాగుందని.. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమని.. 101-200 మధ్య ఉంటే మధ్యస్తమని.. 201-300 మధ్య అయితే బాగోలేదని.. 301-400 మధ్య అయితే ఏ మాత్రం బాగోలేదని.. 401-500 మధ్య అయితే ప్రమాదకరమని.. 500పైన ఉంటే మిక్కిలి ప్రమాదకరంగా పరిగణిస్తారు.

ఈ పరిస్ధితుల నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ భురేలాల్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read:టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు: కేసీఆర్ తేలుస్తారా?

దీనితో పాటు ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నవంబర్ 5 వరకు నిర్మాణ కార్యకలాపాలు , స్టోన్ క్రషర్లు, బొగ్గు ఇతర ఇంధన ఆధారిత పరిశ్రమలను మూసివేయాల్సిందిగా భురేలాల్ ఆదేశించారు.

అలాగే పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను తగులబెట్టడంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 48 కోట్ల మంది ప్రజల ఆయష్షు కాలుష్యం కారణంగా ఏడేళ్లు తగ్గింది.

Also Read:ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, జగన్ ఫ్యామిలీ ఫుల్ హ్యపీ: జోష్ లో వైసీపీ

పంజాబ్, చంఢీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సర్వేలో తేల్చింది. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలను 2.5 పర్టికులేట్ మాటర్‌లో పరిగణనలోనికి తీసుకున్నారు.

ఈ లిస్ట్‌లో అత్యంత కాలుష్య ప్రభావ దేశంగా భారతదేశం ద్వితీయ స్థానంలోనూ..నేపాల్ మొదటి స్థానంలో ఉంది. అలాగే డబ్ల్యూహెచ్ఓ సూచించిన ప్రకారం కాలుష్యాన్ని నివారించడంలో భారత్ విఫలమైందని సర్వే నిగ్గుతేల్చింది. కాగా.. కాలుష్యాన్ని అరికట్టేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ఇండియా ప్రోగ్రామ్ పేరుతో భారతప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

click me!