Bihar bandh: రైల్వే బోర్డు పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీహార్ లో బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో రోడ్లను బ్లాక్ చేశారు. భారీ ఎత్తున టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్నారు.
Bihar bandh: రైల్వే బోర్డు పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీహార్ లో బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో రోడ్లను బ్లాక్ చేశారు. భారీ ఎత్తున టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్నారు. కాగా, ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ (RRB-NTPC) పరీక్ష ఫలితాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గయాలో రెండు రోజుల క్రితం విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఏకంగా ఓ రైలుకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు.. ఎన్టీపీసీతో పాటు లెవల్ 1 పరీక్షలను రద్దు చేసింది.
ఈ క్రమంలోనే ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ (RRB-NTPC) పరీక్షల అవకతవకలను నిరసిస్తూ... విద్యార్థి సంఘాలు బీహార్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనిని రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక విద్యార్థి సంఘాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన ఈ బంద్కు విశేష స్పందన వచ్చింది. నిరసనల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలనే రైల్వే నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి రెండవ దశలో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, జనవరి 15వ తేదీన రైల్వే బోర్డు ఎన్టీపీసీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 35 వేల పోస్టుల కోసం జరిగిన ఈ పరీక్షలను సుమారు 1.25 కోట్ల మంది విద్యార్థులు రాశారు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.
గురువారం ఒక సంయుక్త ప్రకటనలో ప్రతిపక్ష పార్టీలైన రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), సీపీఎంలు "బీహార్ దేశంలో అత్యధిక సంఖ్యలో యువకులను కలిగి ఉంది. అత్యధిక నిరుద్యోగాన్ని సంక్షోభం నెలకొన్నది. విద్యార్థులను కేంద్ర, బీహార్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి" అని పేర్కొన్నాయి. నిరుద్యోగులు తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి కానీ అమలులో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాయి. విద్యార్థులు, నిరుద్యోగులు.. ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వస్తే.. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం వారిపై లాఠీ వర్షం కురిపించిందని ఆరోపించాయి.
రైల్లే పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేయడానికి కుట్ర పన్నిందని AISA ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ ఆరోపించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. "ఖాన్ సర్ వంటి ఉపాధ్యాయులపై పోలీసు కేసులు బీహార్లో అప్రకటిత ఆందోళనలకు విద్యార్థులను మరింత రెచ్చగొట్టగలవు. ప్రభుత్వాలు నిరుద్యోగంపై మాట్లాడి పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైంది" అని మాంఝీ అన్నారు.