
Valentine's Day: వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ మంగళవారం చెన్నైలోని ఓ మహిళా కళాశాల ఎదుట హిందూ అనుకూల సంస్థ సభ్యులు ఆందోళనకు దిగారు. వాలెంటైన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ భరత్ హిందూ మున్నానీ కార్యకర్తలు ఎతిరాజ్ మహిళా కళాశాల వెలుపల నినాదాలు చేశారు. వాలెంటైన్స్ డే భారత సంస్కృతికి వ్యతిరేకమంటూ ప్లకార్డులు పట్టుకొని హిందూ అనుకూల సంస్థ సభ్యులు ఎతిరాజ్ కళాశాల ఎదుట గుమిగూడారు. కరపత్రాలు పంచి వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించాలని చేపట్టిన నిరసన గురించి భారత్ హిందూ మున్నాని నాయకుడు ప్రభు మీడియాతో మాట్లాడుతూ.. ఇది మన సంస్కృతి కాదని అన్నారు. విద్యార్థులు తమ విద్యా, భవిష్యత్తు, వారి తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలన్నారు. ప్రేమికుల రోజును బహిష్కరించాలని కోరారు. 'ప్రేమ జీవితంలో ఒక భాగం. దాని వల్ల మీ ఆశయాన్ని కోల్పోవద్దు. భారతదేశాన్ని బలోపేతం చేయండి.. వేలు నాచియార్ వంటి స్ఫూర్తిదాయక మహిళలుగా మారండి" అని ఈ నిరసన సందర్భంగా ప్రభు అన్నారు.
ఈ క్రమంలోనే అక్కడి చేరుకున్న పోలీసులు ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనను అడ్డుకున్నారు. వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రేమికుల రోజున ఇలాంటి నిరసనలు జరగకుండా ఉమెన్స్ కాలేజీ చర్యలు తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాలేజీ సరిసర ప్రాంతాల్లో అంతటా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పేర్కొన్నారు.
ఇదిలావుండగా, తమిళనాడులోని శివగంగలో వాలెంటైన్స్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ పలువురు హిందూ సంస్థల కార్యకర్తలు కుక్కల మధ్య మాక్ మ్యారేజ్ వేడుకలు నిర్వహించారు. ప్రేమికుల దినోత్సవాన్ని హిందూ మున్నానీ వ్యతిరేకించింది, ఇది భారతదేశ సంస్కృతికి విరుద్ధమైన వేడుక అని ఇందులో భాగమైన నాయకులు పేర్కొన్నారు. కాగా, ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ గత కొన్నేండ్లుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం హిందూ మున్నానీ కార్యకర్తలు రెండు కుక్కలను తీసుకువచ్చి వాటికి బట్టలు, పూలమాలలు వేశారు. ఆ తర్వాత కుక్కలకు పెళ్లిళ్లు అయ్యాయని చూపించడానికి ఓ కేడర్ సింబాలిక్ గా పెళ్లిని జరిపించారు. వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తారనీ, దీనిని వ్యతిరేకించేందుకే తాము కుక్కల పెళ్లి నిర్వహించామని హిందూ మున్నానీ కార్యకర్తలు పేర్కొన్నారు. అయితే, ఒక హిందూ మితవాద వర్గం ఇలాంటి వింత నిరసన చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2018లో వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు ఓ కుక్క, గాడిదకు వివాహం చేసిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది.
భోపాల్ లో ర్యాలీ..
ప్రేమికుల దినోత్సవాన్ని నిరసిస్తూ మంగళవారం భోపాల్ లో సంస్కృతీ బచావో మంచ్ ర్యాలీ నిర్వహించింది. ప్లాటినం ప్లాజా నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పార్కుల చుట్టూ తిరుగుతూ ప్రేమికులు ఎక్కడ కనిపిస్తారా అని నిఘా పెట్టింది. సంస్కృతీ బచావో మంచ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ, కోఆర్డినేటర్ అజయ్ మిశ్రా, పాత భోపాల్ కోఆర్డినేటర్ అభిషేక్ తివారీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. వాలెంటైన్స్ డేను బహిష్కరించడంతో 2019 పుల్వామా దాడిలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించినందుకు సంస్కృతీ బచావో మంచ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంబంధిత నాయకులు పేర్కొన్నారు.