Lalu Prasad Yadav: లాలూ ప్రస్తాద్ యాదవ్ కు బిగ్ షాక్.. ఈడీ విచారణకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్

Mahesh RajamoniPublished : May 8, 2025 8:12 PM

land for jobs scam: రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో జరిగిన భూ కుంభకోణం కేసులో ఆయనపై విచారణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.

Lalu Prasad Yadav: భారత మాజీ రైల్వే మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై భూముల కోసం ఉద్యోగాలు (land for jobs scam) కేసులో అభియోగం నమోదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి మంజూరు చేశారు. భారత రైల్వేలో ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197(1) (ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 218) కింద రాష్ట్రపతి ఈ అనుమతిని మంజూరు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా 2004 నుండి 2009 వరకూ పనిచేసిన సమయంలో ఈ అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన FIR ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ఉద్యోగ అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యులు ఉద్యోగాల కోసం తమ భూములను లాలూ కుటుంబ సభ్యుల పేర్లకు బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఇప్పటికే సీబీఐ మూడు ఛార్జ్‌షీట్లు, సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఇదే కేసులో 2024 జనవరి 8న ఈదీ ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ (PC) ను దాఖలు చేసింది. దీనిలో లాలూ కుటుంబ సభ్యులు రాబ్రీదేవి, మిశా భారతి, హేమా యాదవ్‌లతో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు కూడా ఉన్నాయి.

అలాగే, 2024 ఆగస్టు 6న లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ఇతరులపై కూడా ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలైంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఈ కేసులో అభియోగాలపై ఇప్పటికే గుర్తింపు (cognizance) తీసుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై దాఖలైన ఈ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లను ప్రత్యేక కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది.

Read more Articles on
click me!