
Prayagraj Sant Sammelan: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్రాజ్ సంత్ సమ్మేళన్(Sant Sammelan)లో మరోసారి వివాదస్పద ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే, దేశంలోని ముస్లింల మైనారిటీ హోదాను రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్ వేదికగా జరిగిన సంత్ సమ్మేళన్ పైన పేర్కొన్న వివాదాస్పద తీర్మానాలు చేశారు. ఈ సంత్ సమ్మెళన్ లో భాగంగా ప్రభుత్వం ముందు కొన్ని పెద్ద ప్రతిపాదనలు కూడా చేశారు. ఇందులో ఏటి నరసింహానంద్, వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర త్యాగిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మేళనానికి దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన అనేక సాధు సంతులు పాల్గొన్నారు. మతం గురించి కూడా ఈ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
అలాగే, నరసింహానంద యతి, జితేంద్ర నారాయణ్ త్యాగిని ఒక నెలలోపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే హింసాత్మక ఉద్యమాలు నిర్వహించడానికైనా సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ (Sant Sammelan) తొలి తీర్మానంలో ప్రతినిధుల సభకు హాజరైన సాధువులు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే, రెండో తీర్మానం గురించి మాట్లాడుతూ.. మతమార్పిడి కేసులను పూర్తిగా మూసివేయడంపై చట్టాన్ని కఠినతరం చేయాలని అన్నారు. మతం మారిన వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మూడో తీర్మానం చేస్తూ.. హరిద్వార్ ధర్మసంసద్ లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన స్వామి యతి నరసింహానంద, జితేంద్ర త్యాగి అలియాస్ వసీం రిజ్వీలను బేషరతుగా విడుదల చేయాలని మూడో తీర్మానంలో పేర్కొన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న, హిందువులను గౌరవించని వారు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలని పేర్కొన్నారు. అలాగే, మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ని జాతిపితగా అంగీకరించడానికి నిరాకరిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుండగా, హరిద్వార్ వేదికగా ఇదివరకు జరిగిన ధర్మ సంసద్ (Dharma Sansad) లో పాల్గొన్న పలువురు విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ వసీం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగి త్యాగి, యతి నరసింహానందను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమావేశంలో వీరు ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఆ వివాదాస్పద ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ధర్మ సంసద్ (Dharma Sansad)లో వీరు చేసిన ప్రసంగాలకు గాను ఉత్తరాఖండ్ పోలీసులు జితేంద్ర త్యాగితో సహా పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరాయి ఈ ప్రసంగాలు. దీంతో సుప్రీం కోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.