
కదులుతున్న వాహనంలో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో ఓ పోలీసు అధికారిని కోర్టు దోషిగా నిర్దారించింది. 2017లో జనవరి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఐదేళ్ల తర్వాత సెషన్స్ కోర్టు పోలీసు అధికారిని దోషిగా తేల్చింది. ఈ ఘటన కర్ణాటకలో (Karnataka) చోటుచేసుకుంది. తుమకూరు (Tumakuru) రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పట్లో విధులు నిర్వర్తించిన గుబ్బికి చెందిన ఎస్ ఉమేష్ ఈ కేసులో దోషిగా తేలాడు. వివరాలు.. తుమకూరు పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన మహిళ జనవరి 14 రాత్రి దేవాలయానికి వెళ్లి వస్తుండగా తుమకూరు శివార్లకు చేరుకున్నాక తన ఇంటికి వెళ్లే దారిని సరిగా గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో ఆమెను ఇంటి వద్ద దింపుతానని చెప్పిన ఉమేష్ మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి ఉమేష్పై 2017 జనవరి 15వ తేదీన తుమకూరు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏఎస్ఐగా అతనిపై 376(2) (iii) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వెంటనే అతడిని అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఉమేష్ తుమకూరు జిల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత కోర్టులో వాదనలు వినిపిస్తూ.. ‘మహిళ తన ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి వెళ్లింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆమె కాలినడకన ఆలయానికి వెల్లింది. కానీ ఆమె ఆలయానికి చేరుకునే సరికి రాత్రి 11 గంటలు అయింది. అప్పటికే ఆలయం మూసివేసి ఉంది. అయితే అప్పటికే అలసిపోయిన మహిళ.. అక్కడే కొద్దిసేపు పడుకుంది. తెల్లవారుజామున 2 గంటలకు తిరిగి కాలినడకన ఇంటికి బయలుదేరింది.
అయితే ఆమెకు నైట్ బీట్లో ఉన్న ఉమేష్ మరో నలుగురు పోలీసులు తుమకుర్-మధుగిరి రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో కలిశారు. వారు ఆమె దివ్యాంగ మహిళగా గుర్తించారు. అప్పుడు ఆమె అస్పష్టంగా తన అడ్రస్ను పోలీసులకు తెలిపింది. అప్పుడు ఈశ్వర్ జీప్ నడుపుతుండగా.. ఉమేష్ ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని చెప్పి అందులో బయలుదేరాడు. ఆ తర్వాత ఉమేష్ బాధిత మహిళను ఆమె ఇంటి వద్దకు చేర్చారు. ఇంటి బయట వాహనం ఆగడంతో.. ఆమె తల్లి, సోదరుడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వారిని చూసి ఆ మహిళ గట్టిగా కేకలు వేస్తూ.. తనపై 'పోలీస్ అంకుల్' అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో ఉమేష్ వెంటనే ఈశ్వర్ను వాహనం పోనివ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని తెలిపారు. ఇక, బాధితురాలి కుటుంబం ఈ ఘటనపై జనవరి 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది
తుమకూరు శివారులో వాహనంలో వెళ్తున్న సమయంలో ఉమేష్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈశ్వర్ను ఉమేష్ డ్రైవ్ చేయమని చెప్పాడని.. తాను చెప్పిన మాట వినకుంటే అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడినట్టుగా చార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ఈశ్వర్ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గతంలో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ కేసు విచారణ సందర్భంగా తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని ఉమేష్ బెదిరించినట్టుగా ఈశ్వర్ చెప్పాడు.
ఇక, తాజాగా ఈ కేసులో రెండో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమర్తి జస్టిస్ మల్లికార్జున స్వామి.. ఉమేష్ను దోషిగా నిర్దారించారు. అతనికి సోమవారం రోజున శిక్ష విధించనున్నట్టుగా తెలిపారు.