
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబాల్లో గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో మే 1వ తేదీన (మేడే రోజున) ప్రారంభించింది. కట్టెల పొయ్యి ముందు కాలాన్ని వెళ్లదీసే ఆడబిడ్డలు, పొగ వల్ల పలు ఆరోగ్య సమస్యలూ లోనవుతారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాల్లోని ఆడపడచులూ ఇక కట్టెల పొయ్యి ముందే జీవితాన్ని మసకబార్చుకోవాల్సిన అవసరం లేదని, వారికీ కుటుంబాలకూ గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం రూపుదిద్దుకుంది. అంతకు ముందు గ్యాస్ కనెక్షన్లు లేవా? అంటే ఉన్నాయి. కానీ, వాటిని అందుకోగలిగే స్తోమత ఉన్నవారికే అవి పరిమితంగా ఉన్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా ద్వారా పేదల కుటుంబాల్లోకి గ్యాస్ బండ వచ్చిందని ఈ పథకం సాధించిన విజయాలు వెల్లడిస్తాయి. ఆడబిడ్డల బాధలే కాదు.. ఈ పథకం ఇటు అటవీ సంరక్షణ, మరోవైపు వాయు కాలుష్య నివారణకు ఎంతో కొంత దోహదపడుతుంది.
2016 మే 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో 1.50 కోట్ల కుటుంబాలకు (దారిద్ర్య రేఖకు దిగువన ఉండే) అందివ్వాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ, 2.2 కోట్ల కనెక్షన్లు తొలి సంవత్సరం ఇచ్చారు. 2018 డిసెంబర్ కల్లా ఈ పథకం కింద 5.8 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. 8 కోట్ల మంది లబ్దిదారులను గుర్తించడంలో టెక్నాలజీ ఉపయోగపడిందని 2020 జనవరిలో ప్రధాని మోడీ ఓ కార్యక్రమంలో అన్నారు. 2014 నుంచి 2022లో గ్యాస్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య (గ్రామీణంలో)లో 158 శాతం పెరగడమే ఈ పథకం విజయానికి నిదర్శనం.
Also Read: రక్షాబంధన్ పండుగకి మహిళలకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు!
ఎలా లబ్ది పొందాలి?
ముందు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి దరఖాస్తు దారు మహిళ అయి ఉండాలి. ఆమె కుటుంబంలో ఇది వరకే ఏ కంపెనీ నుంచి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టుగా ఒక ఆధారం ఉండాలి. ఉదాహరణకు వారు ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, అంత్యోదయ అన్న యోజన వంటి కేటగిరీలకు చెందినవారైనా ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్లు:
కేవైసీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ, సప్లిమెంటరీ కేవైసీ డాక్యుమెంట్లు అవసరం
వీటిని తీసుకుని సమీపంలోని ఏదైనా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వెబ్ సైట్లోకి వెళ్లి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.