
తనను ఎన్ కౌంటర్ చేసి చంపేయవచ్చని ఓ పోలీసు ఇన్ స్పెక్టర్ బెదిరించారని 27 నెలల పాటు జైలులో ఉండి ఇటీవలే బయటకు వచ్చిన యూపీ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని సూచించారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రాంపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ ఓ ఇన్ స్పెక్టర్ నన్ను జైలులో కలిశాడు. అండర్ గ్రౌండ్ కు వెళ్లు. నీపై అనేక కేసులు ఉన్నాయి. మిమల్ని ఎన్ కౌంటర్ చేయవచ్చు. అని బెదిరించాడు. అలాంటి ప్రమాదాల హెచ్చరికల నేపథ్యంలో నా ప్రయాణం ఏమిటో చెప్పడం కష్టం ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీకి హిందీలో ఆహ్వానం పలికిన జపనీస్ అబ్బాయి.. ‘వాహ్’ అంటూ మెచ్చుకున్న ప్రధాని (వీడియో)
చీటింగ్ కేసులో జైలుకెళ్లిన సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ గత శుక్రవారం సీతాపూర్ నుంచి జైలు నుంచి విడుదల అయ్యారు. 27 నెలలుగా జైలులో ఉన్న ఆజం ఖాన్కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆజాంఖాన్ పై భూ కబ్జాల ఆరోపణలతో పాటు 88 కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బిఆర్ గవాయి, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఖాన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల వ్యవధిలో సంబంధిత కోర్టు ముందు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ను సంబంధిత న్యాయస్థానం నిర్ణయించే వరకు మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని సుప్రీం కోర్టు హామీ ఇచ్చింది.అత్యున్నత న్యాయస్థానం పరిశీలనల ప్రభావానికి గురికాకుండా మెరిట్లపై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును కోరింది.
అయితే ఆజంఖాన్ బెయిల్ పిటిషన్ పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడిని ‘భూ కబ్జాదారుడు, అలవాటు నేరస్థుడు’ అంటూ ఆరోపించింది. అయితే బెయిల్ పిటిషన్ ను విచారించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు గతంలోనే అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని పేర్కొంది.
అయితే బెయిల్ పై ఉన్న ఆజంఖాన్.. ఫోర్జరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న తన సన్నిహితుడు గుడ్డు మసోద్ను కలిసేందుకు ఆదివారం రాంపూర్ జిల్లా జైలును సందర్శించాడు. ఆయన ఖాన్ ఇతర ఖైదీలను కూడా కలిశాడు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆజంఖాన్, ఆయన స్నేహితుడు శివపాల్ సింగ్ యాదవ్ దూరంగా ఉన్నారు.
ఆరోగ్య కారణాల వల్ల తాను ఆ సమావేశానికి హాజరు కాలేనని ఖాన్ చెప్పారు. కానీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆజంఖాన్, ఇతర ముస్లిం సమాజాన్ని విస్మరించారని ఆయనకు సన్నిహితులు తెలిపారని, ఇది పార్టీ మధ్య చీలికకు దారి తీసిందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. అయితే ఆజంఖాన్ కోపాన్ని అఖిలేష్ యాదవ్ చల్లబరుస్తారా అని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానమిస్తూ..“నేను ఎలాంటి ఆధారం లేని మనిషిని. కాబట్టి ఆగ్రహానికి ఆధారం ఎక్కడుంది. నేను ఇప్పుడు పేదవాడిని. బైలేన్లో నివసిస్తున్నాను. ఫోర్ వీలర్ వెహికిల్ కూడా వెళ్లలేని రద్దీలో నివసిస్తున్నాను” అని ఆయన తెలిపారు.