
చత్తీస్ ఘడ్ : సాయుధ బలగాలే టార్గెట్ గా మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు(మందుపాతర) పేలి ఏసిపి మృతిచెందిన ఘటన చత్తీస్ ఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం గాలిస్తున్న క్రమంలో ఏసిపి మందుపాతరపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
భస్తర్ జిల్లాలోని తిమినార్ క్యాంప్ నుండి అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ విజయ్ యాదవ్(40) నేతృత్వంలో సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ కు వెళ్లారు. ఎటపాల్ రహదారి మార్గంంలో గాలింపు చేపడుతుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై విజయ్ కాలుపెట్టడంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Read More బస్తర్ లో కాల్పుల మోత.. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు కోబ్రా కమాండోలకు గాయాలు
సాయుధ బలగాల సమాచారం అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు ఏసిపి మృతదేహాన్ని అక్కడినుండి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా రాజ్ పూర్ కు తరలించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఏసిపి మృతిపట్ల సాయుధ బలగాల అధికారులతో పాటు స్థానిక పోలీసులు సంతాపం ప్రకటించారు.
ఇదిలావుంటే ఇటీవల ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా స్వాభిమాన్ అంచల్లోని తైమల్ అడవుల్లో భారీ పేలుడు పదార్థాల నిల్వ ఉన్న మావోయిస్టుల డంప్ను బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. బలిమెల రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల డంప్ను బీఎస్ఎఫ్ ఆపరేషనల్ పార్టీ రికవరీ చేసుకుంది. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో మావోయిస్టులో ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, తుపాకులను డంప్లో దాచినట్లు తేలింది. ఈ డంప్ నుంచి ఒక తుపాకీ, 2 ఖాళీ ఎస్బీఎంఎల్ షెల్లు, 11 హ్యాండ్ గ్రనేడ్లు, 28 డిటోనేటర్లతో పాటు 3 స్టీల్ టిఫిన్ బాక్స్లు, మావోయిస్టులు ఉపయోగించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భౌగోళిక కారణాలు, అనుకూలమైన వాతావరణం కారణంగా బలిమెల రిజర్వ్ ఫారెస్ట్ చాలా కాలంగా మావోయిస్టులకు సురక్షితమైన స్వర్గధామంగా ఉందని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టడానికి, స్థానిక ప్రజలలో భద్రతా భావాన్ని సృష్టించడానికి భద్రతా దళాలు, పోలీసులు చరుకుగా పనిచేస్తారని బీఎస్ఎఫ్ తెలిపింది. మావోయిస్టుల భావజాలం ఇకపై వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.