తమిళనాడులోని పుదుచ్చేరిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కళ్లెదుటే ఇద్దరు పోలీసులు యువతిపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన నిజమని తేలడంతో పోలీసులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు.
చెన్నై: ప్రజలను రక్షించాల్సిన పోలీసులే పైశాచికత్వం ప్రదర్శించారు. ప్రియుడి ముందే అతని ప్రేయసిపై పోలీసు కానిస్టేబుల్స్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి జరిగింది. యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు.
పుదుచ్చేరి తమిళనాడులో ప్రజాదరణ గల పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతానికి వారాంతాల్లో ప్రేమజంటలు వస్తుంటాయి. శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు అక్కడ బస చేశాయి. గస్తీ తిరుగుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, సురేష్ ప్రేమ జంటలు ఉన్న గదుల తలుపులు తట్టారు.
ఒక ప్రేమజంట గది తలుపులు తట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని, కేసులు పెడుతామని బెదిరించారు. దాంతో భయపడిన ప్రేయసీప్రియులు వారికి రూ.20 వేలు ఇచ్చి రాజీ చేసుకున్నారు. ఆ తర్వాత మరో ప్రేమజంట ఉన్న గదికి వద్దకు వెళ్లారు.
ఆయితే, వారి వద్ద డబ్బులు లేవు. దీంతో ప్రియుని కళ్లెదుటే యువతిపై వారు అత్యాచారం చేశారు. పరువు పోతుందనే ఉద్దేశంతో వారిద్దరు గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ వ్యవహారం ఎలాగో బయటకు పొక్కింది. దాంోత సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అత్యాచారం, మామూళ్ల వసూళ్ల వ్యవహారం నిజమని తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు.