ప్రపంచ దేశాల దృష్టంతా భారత్ పైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. సమకాలీన రాజకీయాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు.
ప్రపంచం దృష్టంతా నేడు భారత్పై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశ పౌరుడూ జిజ్ఞాసతో భారత్ వైపు చూస్తున్నారన్నారు. టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ప్రధాని మోదీకి మై హోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. సమకాలీన రాజకీయాలతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు.
భారతదేశ ఆలోచనల గురించి యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని మోదీ పేర్కొన్నారు. గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉదహరించారు. వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన, అద్భుతమైన కార్యక్రమమని అభినందించారు.
అనంతరం మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర రావు మాట్లాడారు. మోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాలను వివరించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ డేటా ప్రకారం రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు.
పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లాంటి వాటిలో మార్పునకు దారితీస్తున్నాయని చెప్పారు. డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని కొనియాడారు.
డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని జూపల్లి తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందని, 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని తెలిపారు.