నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా తిరిగి వచ్చినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత సంతతికి చెందిన విలియమ్స్ తొలుత కేవలం 8 రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో 286 రోజులు అంతరిక్షంలోనే ఉండిపోయారు. అనుకున్నదానికంటే 278 రోజులు ఎక్కువ గడిపారు.
"స్వాగతం #Crew9! భూమి మిమ్మల్ని మిస్సయింది" అని మోదీ పోస్ట్ చేశారు. "ఇది ధైర్యానికి, సాహసానికి పరీక్ష. సునీతా విలియమ్స్, #Crew9 వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏమిటో చూపించారు. వారి అచంచలమైన సంకల్పం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది" అని Xలో రాశారు.
సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో బయలుదేరారు. ఈ మిషన్ వారం రోజులు మాత్రమే ఉంటుంది అనుకున్నారు. కానీ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు రావడంతో ఎక్కువ రోజులు పట్టింది. నాసా వ్యోమనౌకను సిబ్బంది లేకుండానే వెనక్కి రప్పించి, స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా వారిని తిరిగి రప్పించే ఏర్పాట్లు చేసింది. క్యాప్సూల్లో సమస్యల కారణంగా వారి రాక మరింత ఆలస్యమై మార్చికి వాయిదా పడింది.
విలియమ్స్ను మార్గదర్శకురాలు, గొప్ప వ్యక్తి అని ప్రధాని మోదీ అంతరిక్ష పరిశోధనలకు ఆమె చేసిన కృషిని కొనియాడారు.
"అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్యాన్ని పెంచడం, కలలు కనడానికి ధైర్యం చేయడం, ఆ కలలను నిజం చేయడానికి సాహసం చేయడం. సునీతా విలియమ్స్ తన కెరీర్లో ఈ స్ఫూర్తిని చాటారు" అని మోదీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
సిబ్బంది సురక్షితంగా తిరిగి రావడానికి కృషి చేసిన బృందాల కృషిని కూడా ఆయన అభినందించారు.
"వ్యోమగాముల సురక్షితమైన రాక కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వారందరినీ చూసి మేము గర్విస్తున్నాము. కచ్చితత్వం, అభిరుచి, సాంకేతికత, పట్టుదల కలిస్తే ఏమి జరుగుతుందో వారు నిరూపించారు" అని ఆయన అన్నారు.
విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత త్వరలో భారతదేశానికి వస్తారని ఆమె కుటుంబం తెలిపింది. విలియమ్స్, విల్మోర్ భూమి చుట్టూ 4,576 సార్లు తిరిగారు. మొత్తం 121 మిలియన్ మైళ్లు (195 మిలియన్ కి.మీ) ప్రయాణించారు.