
Assembly election 2022: వచ్చే నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly election 2022) జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడేక్కాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో యూపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీకి పార్టీ వీడుతున్న వారితో పాటు, ఎమ్మెల్యేలకు పట్ల స్థానికంగా వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కమలం పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల (Assembly election 2022) ను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi).. ఫిబ్రవరి 2న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman-Minister of Finance) ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ లోని అంశాలతో పాటు ఎన్నికల విషయాలను కూడా ఆయన ప్రస్తావించనున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని మోడీ ప్రసంగానికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రధాని ప్రసంగాన్ని ప్రజలు వినేందుకు దేశంలోని పలు జిల్లాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ నిబద్ధతకు కేంద్ర బడ్జెట్ ప్రతిబింబమని ప్రధానమంత్రి హైలైట్ చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు (Assembly election 2022) జరగనున్న నేపథ్యంలో ప్రధాని (Prime Minister Narendra Modi) ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. మణిపూర్ (Manipur)లో ఫిబ్రవరి 27 నుంచి రెండు దశల్లో, పంజాబ్ (Punjab), గోవా, ఉత్తరాఖండ్ (Uttarakhand)లలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్లో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీలలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఐదు మరియు ఆరవ దశలతో సమానంగా పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.
కాగా, ప్రస్తుతం జరగున్న ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతం ఎగురవేసి అధికార పీఠం దక్కంచుకోవాలని బీజేపీ చూస్తోంది. అయితే, దేశంలో అత్యంత ప్రధాన్యత కలిగి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. అలాగే, గోవా (Goa)లోనూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నది.