
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్లోని గాంధీనగర్లో ‘‘డిజిటల్ ఇండియా వీక్ 2022’’ ప్రారంభోత్సవంలో ఓ బాలిక భావోద్వేగ కథను పంచుకున్నారు. రెండేళ్ల తర్వాత ఆధార్ కార్డు సహాయంతో బాలిక తన కుటుంబాన్ని ఎలా చేరుకోగలిగిందో ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఘటనను ఆ బాలిక ఓ వీడియోలో ప్రధాని మోదీకి గుర్తు చేసింది. ఆమె కుటుంబం నుంచి వేరే నగరంలో బంధువుల ఇంటికి వెళుతున్నప్పుడు రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెను సీతాపూర్లోని ఓ అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు.
ఆ బాలిక మాట్లాడుతూ.. ‘‘నేను రెండేళ్లుగా అనాథ శరణాలయంలో ఉన్నాను. 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే సమయం రాగానే చాలా మంది అమ్మాయిలు.. వారి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. నేను అలా వెళ్లలేకపోయాను. దీంతో అక్కడి అనాథాశ్రమం నిర్వహకులు నన్ను దాని లక్నో బ్రాంచికి మార్చారు’’ అని చెప్పింది.
అయితే ఇక్కడే అధికారులు బాలికకు ఆధార్ కార్డు ఇచ్చేందుకు వచ్చారు. అయితే క్షుణ్ణంగా విచారించిన అధికారులు.. ఆమెకు ఇప్పటికే ఆధార్ కార్డు ఉందని బాలికతో పాటు అనాథాశ్రమ అధికారులకు సమాచారం అందించారు. అనాథ ఆశ్రమ అధికారులు ఆమె ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి ఆమె కుటుంబాన్ని కనుగొనడంలో సహాయం చేశారు. గాంధీనగర్లో జరిగిన డిజిటల్ ఇండియా వీక్ 2022 కార్యక్రమంలో ప్రధాని మోదీ పంచుకున్న అనేక సంఘటనలలో ఇది ఒకటి.
డిజిటల్ ఇండియాకు సంబంధించి మరోక సంఘటనను మోదీ పంచుకుంటూ.. ‘‘ఇప్పుడు ఒక వీధి వ్యాపారి కూడా మాల్ షోరూమ్లో ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపు విధానాన్ని వినియోగిస్తున్నాడు. ఒక బిచ్చగాడు QR కోడ్ని ఉపయోగించి డిజిటల్ చెల్లింపు చేస్తున్న వీడియోను నేను చూశాను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర ఈ కార్యక్రమంలో పటేల్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.