PM Modi Security lapse: ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలో విచారణ..

By Sumanth KanukulaFirst Published Jan 12, 2022, 11:25 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫల్యంపై (PM Modi Security lapse) విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు (supreme court) బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. 

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫల్యంపై (PM Modi Security lapse) విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు (supreme court) బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. ఈ విచారణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, పంజాబ్ పోలీసులు విచారణలో భాగం కానున్నారని వెల్లడించింది. 

ఈ కమిటీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, చంఢీఘర్ పోలీస్ చీఫ్, డైరెక్టర్ జనరల్‌ (సెక్యూరిటీ) ఆఫ్ పంజాబ్, పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉండనున్నారు. "ఈ ప్రశ్నలను ఏ ఒక్క పక్షం విచారణపై వదిలిపెట్టలేము. మాకు స్వతంత్ర దర్యాప్తు అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది.

జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని విచారణ కమిటీ.. భద్రతా ఉల్లంఘనకు కారణమేమిటో, ఎవరు బాధ్యులు, భవిష్యత్తులో ఇటువంటి లోపాలను నివారించడానికి ఎలాంటి రక్షణలు అవసరమో విచారించి.. నివేదికను వీలైనంత త్వరగా సమర్పిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.


గత వారం ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనకు వెళ్లారు. ఆయన బఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఓ ఫ్లై ఓవర్‌పై మోదీ కాన్వాయ్ దాదాపు 15 నుంచి 20 నమిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరడంతో.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోడీ పర్యటనకు అవసరమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేక ఆయన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టిందని బీజేపీ మండిపడింది. ప్రధాని మోడీ పర్యటనలో చివరి నిమిషంలో మార్పు వచ్చిందని.. రైతులు రోడ్లమీదకు రావడం ఒక్కసారిగా జరిగిపోయిందని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.

ఈ క్రమంలోనే ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనపై (PM Modi Security Lapse) విచారణ చేపట్టాలని కోరుతూ లాయర్స్ వాయిస్ (Lawyers Voice) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఈ  ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతన్న అన్ని విచారణలను నిలిపివేయాలని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలను సోమవారం ఆదేశించింది. ఈ ఘటనపై విచారణకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో  కమిటీని నియమించింది. 


 

click me!