
కరోనా సోకిన వారు వైరస్ నుంచి కోలుకున్న తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్ టీఏజీఐ) సిఫార్సు చేస్తోంది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్.. ఇప్పుడు దాన్ని 9 నెలలకు పెంచింది.
తాజా ప్రతిపాదనలను ప్యానెల్ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం కరోనా బారిన పడ్డవారు కోలుకున్నాక 4 నుంచి 8 వారాల తర్వాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు.
అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాంటీబాడీస్ మరింత ఎక్కువగా వృద్ధి అభివృద్ధి చెందుతాయని ఎన్ టీఏజీఐ చెబుతోంది. కరోనా సోకి కోలుకున్నవారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచిది. 9 నెలల తర్వాత తీసుకున్నట్లయితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. అని ప్యానెల్ వివరించింది.
ఇదిలా ఉండగా... వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్వో కూడా చెబుతోంది. వ్యాక్సినేషన్ విధానంపై ఎన్ టీఏజీఐ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే.
బాలింతలు గర్భిణీలు టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసిన ప్యానెల్.. మొదటి డోసు తీసుకున్నాక కరోనా బారిన పడితే కోలుకున్నాక 4 8 వారాలు వేచి ఉండి, తర్వాత రెండో డోసు వేయించుకోవచ్చని తెలిపింది. ప్లాస్మా చికిత్స చేయించుకున్న వారైతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మూడు నెలలకు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది.
ఇక కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలని ఈ ప్యానెల్ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.