
Congress's Pawan Khera Arrested By Assam Cops: ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు విమానంలో బయలుదేరిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో దాదాపు 50 మంది కాంగ్రెస్ నేతలు విమానాన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకుని ఆందోళనకు దిగారు.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ-రాయ్ పూర్ ఇండిగో విమానం 6ఈ-204 నుంచి కిందకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అస్సాం పోలీసులు గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అస్సాంలోని 15 జిల్లాల్లో పవన్ ఖేరాపై 15 కేసులు నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తండ్రిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. "ఆయన్ను (పవన్ ఖేరా) అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరాం. స్థానిక కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత అతన్ని అస్సాంకు తీసుకువస్తాం" అని అస్సాం పోలీసు అధికార ప్రతినిధి, ఐజీపీ ప్రశాంత్ కుమార్ భుయాన్ తెలిపారు.
పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. ఇది సుదీర్ఘ పోరాటం, నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. వారు ఎందుకు తీసుకెళ్తున్నారో చూస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ అరెస్టు క్రమంలో ఆందోళనలకు దిగాయి.
ఢిల్లీ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు, అస్సాం పోలీసులు, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఉన్న సమయంలో కొన్ని గంటల నాటకీయత తర్వాత.. అస్సాం పోలీసులు ఖేరాను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇదే అస్సాం పోలీసులు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్న చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నిర్బంధానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది నియంతృత్వం కాకపోతే ఇంకేంటి? అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా అన్నారు.