
పితృస్వామ్య సమాజం మహిళలను వెనక్కి నెట్టేస్తోందని నాగాలాండ్ నుంచి మొదటి సారిగా రాజ్యసభకు నామినేట్ అయిన ఫాంగ్నాన్ కొన్యాక్ అన్నారు. నాగాలాండ్ లో కూడా పితృస్వామ్యం అధికంగా ఉంటుందని, అయితే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని చెప్పారు. మహిళలు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పారు.
45 ఏళ్ల తరువాత పార్లమెంట్ కు వెళ్తున్న మహిళగా ఫాంగ్నాన్ కొన్యాక్ చరిత్ర సృష్టించారు. 1977లో చివరి సారిగా ఓ మహిళ లోక్ సభలో అడుగుపెట్టారు. తరువాత నుంచి ఇప్పటి వరకు ఎవరూ నాగాలాండ్ నుంచి లోక్ సభలోగానీ, రాజ్యసభలో సభ్యులుగా లేరు. నాగాలాండ్ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు మహిళలు పోటీ చేసినప్పటికీ, అక్కడ మహిళలకు తక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి వారు విజయం సాధించలేదు. అయితే మొదటి సారిగా నాగాలాండ్ బీజేపీ ఓ మహిళలను రాజ్యసభకు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ తో ఓ ప్రముఖ మీడియా సంస్థ మాట్లాడింది. ఆమె రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ? ఏం చదువుకున్నారు, బీజేపీవైపు ఎలా ఆకర్శితులయ్యారు వంటి అనేక అంశాలను ఆమె పంచుకున్నారు.
మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారు ?
స్కూల్, కాలేజీల్లో చదివే రోజుల్లో నుంచే విద్యార్థి సంఘాల కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొన్నాను. ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఇంటికి తిరిగి వచ్చాను. ఇక్కడ మహిళ సంఘాల్లో చేరాను. తరువాత రాజకీయాల్లోకి వచ్చాను. నేను మొదట్లో ఏ పార్టీలో చేరలేదు. కానీ వ్యక్తిగతంగా అభ్యర్థులకు మద్దతు ఇచ్చాను. అయితే నేను క్రియాశీల రాజకీయాల్లో ఉండాలంటే నేను ఏదో ఒక పార్టీలో చేరడమే మంచిదని నిర్ణయించుకున్నాను. అందుకే 2017లో బీజేపీలో చేరాను.
బీజేపీలోనే ఎందుకు చేరారు ? ఆ పార్టీ మిమ్నల్ని ఎలా ఆకర్శించింది ?
బీజేపీ ఒక జాతీయ పార్టీ. 2013లో మా నియోజకవర్గంలో మేము మద్దతు ఇచ్చిన అభ్యర్థి బీజేపీ నుంచే పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎలా పని చేస్తుందో చూశాను. ఆ పార్టీ పనితీరును గమనించాను. ఇది నాకు ఆసక్తికరంగా అనిపించింది. అందుకే బీజేపీలో చేరాను.
నాగాలాండ్ నుంచి ఓ మహిళ రాజ్యసభకు రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది ?
రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ ప్రతీ సారి ఎవరి రాజకీయ అవసరాలు వారికి ఉంటాయి. ఈసారి కూడా మిత్రపక్షాల నుంచి ఒక అభ్యర్థిని లోక్ సభకు, బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని రాజ్యసభకు పంపించాలని అవగాహన కుదిరింది. అయితే నేను కూడా రాజ్యసభ స్థానం కోసం దరఖాస్తు చేసుకోకపోతే ఎంపిక అయ్యేదానిని కాదు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే మహిళలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే ఎవరైనా తమను నెట్టివేస్తారని ఎదురుచూడకుండా ఒక అడుగు వేయాలి. నాగాలాండ్ పితృస్వామ్య సమాజం అధికంగా ఉంటుంది. మహిళలను చివరి అడుగు వేయకుండా అడ్డుకునే పరిస్థితులు కూడా ఉంటాయి.
బీజేపీకి గణనీయమైన సంఖ్యలో మహిళా ఓట్లు వచ్చాయి కదా ? పార్టీ మిమ్మల్ని దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహించిందా ?
అలా ఏం లేదు. వాస్తవానికి నేను రాజ్యసభ స్థానానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు పార్టీ వివేకంతోనే నా పేరును ఎంపిక చేసింది దరఖాస్తు చేయమని నన్ను ఎవరూ కోరలేదు. పార్టీ పొందిన అనేక దరఖాస్తులలో నా దరఖాస్తు ఒకటి. నేను అభివృద్ధిపై దృష్టి సారించాలనుకుంటున్నాను. నాగాలాండ్లో యువకులు, విద్యావంతులు ఉన్నారు. మేము దేశ అభివృద్ధికి ఎంతో దోహదపడగలుగుతాం.
మీ పార్టీ హిందుత్వ భావజాలానికి ప్రసిద్ధి. రాష్ట్రంలో ఆధిపత్య క్రైస్తవ సమాజంతో ఇది కొనసాగుతుంది ?
నా దృష్టిలో రాజకీయం రాజకీయమే. మతం మతమే. నేను రెండింటినీ కలపను. వేరు వేరుగానే చూస్తాను. బీజేపీ అభివృద్ధి రాజకీయాలను నమ్ముతుంది. నేను క్రిష్టియన్ ని అయినప్పటికీ నేను బీజేపీలో ఉన్నాను. నాగాలాండ్ లో ప్రజలు దీనిని అంగీకరిస్తున్నారు.