Parliament winter session: ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ

By team teluguFirst Published Nov 29, 2021, 10:48 AM IST
Highlights

పార్లమెంట్‌ సమావేశాల్లో  (Parliament winter session 2021) ఏ అంశం పైనైనా చర్చకు, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో  (Parliament winter session 2021) ఏ అంశం పైనైనా చర్చకు, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. కాసేపట్లో పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. సమావేశాలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు అని తెలిపారు. పార్లమెంట్‌లో సమస్యల గురించి ప్రస్తావించవచ్చని.. కానీ పార్లమెంట్, స్పీకర్ చైర్ గౌరవాన్ని కాపాడాలని అన్నారు. 

దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నూతన ఉత్తేజంతో రాజ్యంగ దినోత్సవాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రజలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజల సేవ.. దేశ ఉజ్వల భవిష్యతకు శుభ సంకేతం అని వ్యాఖ్యానించారు. 

Also read: Parliament winter session: కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు.. ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం

పార్లమెంట్ సమావేశాల తొలి రోజే.. సాగు చట్టాల రద్దు (repealing of three farm laws) బిల్లును సభ ముందుకు తీసుకురావాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తుంది. అలాగే కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానుంది. అయితే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతపై,  సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విపక్షాలు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నాయి. సాగు చట్టాలను కేంద్రం మరో రూపంలో తీసుకు వస్తుందని అనుమానిస్తున్న విపక్షాలు.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరంగా సమాధానం చెప్పాలిన డిమాండ్ చేయనున్నాయి. 

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు (adjournment motion) ఇచ్చారు. సాగు చట్టాలు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. వ్యవసాయ చట్టాల నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారంకు సంబంధించింది వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 'మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని ప్రారంభించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలో గత ఏడాది కాలంలో మరణించిన 700 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలనే డిమాండ్‌పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 

click me!