
న్యూఢిల్లీ: ఒక దేశ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలకు మధ్య అంతరం ఉంటుంది. అలాగే, దాని పొరుగు దేశ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మధ్య అంతరం ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణాపూరిత వాతావరణం ఉంటుంది. కానీ, ఆ ఇరు దేశాల ప్రజలు మాత్రం ఒకరికొకరు ప్రేమగా ఉంటారు. అందుకే ప్రభుత్వాలు వేరు, ప్రజలు వేరు అంటూ ఓ ప్రముఖ జర్నలిస్టు చేసిన కొటేషన్ చాలా సార్లు చర్చకు వస్తూ ఉంటుంది. మన దాయాది దేశం పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి మన దేశంలో బైక్ టూర్ వేశాడు. కొన్నేళ్లపాటు వీసా కోసం దరఖాస్తు కోసం ఎదురుచూసి చివరకు అది పొందగానే గంతులేశాడు. దేశమంతటా పర్యటించి ఇక్కడి ప్రజలతో ఇష్టాన్ని పెంచుకున్నాడు. పై కొటేషన్ పేర్కొంటున్నట్టుగా ఈ రెండు దేశాల ప్రజల మధ్య శత్రుత్వమేమీ లేదు అని బైక్ టూర్ ద్వారా ఆ వ్యక్తి తెలియజేశాడు.
పాకిస్తానీ వ్లాగర్ అబ్రార్ హసన్ మోటార్ బైక్ తీసుకుని ఇండియా మొత్తం చుట్టివచ్చాడు. 30 రోజుల్లో ఆయన తన ఫ్రెండ్షిప్ టూర్ పూర్తి చేశాడు. ఈ టూర్లో భాగంగా సుమారు 7,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆయన తన పర్యటన సమయంలో ఎంతో మంది ఆయనను ఆప్యాయంగా స్వాగతించారు. ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం లేకున్నా.. ఇక్కడి ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు.
ఆ బైకర్ సోషల్ మీడియాలో ఈ టూర్కు సంబంధించి ఎన్నో ఫొటోలు పంచుకున్నాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, ముంబయి, కేరళ సహా అనేక ప్రాంతాల ఫొటోలను షేర్ చేశాడు. ఆయన తన టూర్ను యూట్యూబ్ హ్యాండిల్ వైల్డ్లెన్స్ బై అబ్రార్లో డాక్యుమెంట్ చేశాడు.
Also Read: భారత్ నా దేశం; ఇస్లాం నా మతం
అబ్రార్ బీఎండబ్ల్యూ ట్రైల్ బైక్ పై ప్రయాణించిన ఆయన ప్రొఫెషనల్ కెమెరా ఒక దాన్ని తన హెల్మెట్లో పెట్టుకున్నాడు. చేతితో ఉపయోగించే కెమెరానూ వెంట తీసుకెళ్లాడు.
ఆయనకు ఎంతో మంది భోజనం పెట్టారు. మరెందరో ఆయన వెంటే వారి వారి బైక్లపై వెళ్లారు.
ఏప్రిల్ 3వ తేదీన ఈ ప్రయాణం ప్రారంభించాడు.
కేరళ ట్రిప్లో ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కేరళను దేవతల భూమి అని ఎందుకు అంటారో తెలిసిందని పొంగిపోయాడు. ప్రతీ ఒక్కరు చూడాల్సిన అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయని వివరించాడు. రాజస్తాన్ గురించి చెబుతూ రాజుల భూమిగా పేరున్న ఈ గడ్డపై అందమైన కోటలు, ఆలయాలు, మసీదులు, ప్యాలెస్లు ఉన్నాయని పేర్కొన్నాడు. హవా మహల్ ముందు దిగిన ఫొటోలు షేర్ చేశాడు.
వైవిధ్యమైన వాతావరణాలతో వరం పొందిన భారత్లో తాను ప్రతి రోజు అద్భుత దృశ్యాలు చూశానని, స్థానికుల స్నేహం తన పర్యటనను మరింత మధురంగా తీర్చిదిద్దిందని వివరించారు. ఆయన పోస్టులకు నెటిజన్ల నుంచీ మంచి స్పందన వచ్చింది. వీడియోలకూ విశేష ఆదరణ లభించింది