
న్యూఢిల్లీ: 16ఏళ్ల ఓ పాకిస్తాన్ బాలిక.. ఇంకా మైనార్టీ కూడా తీరలేదు. పైగా సిగ్గరి. కానీ, ఆన్లైన్లో పరిచయమైన ఇండియన్ ప్రియుడి కోసం రెండు దేశాలు దాటొచ్చి కలుసుకుంది. ఊరు దాటడమే తెలియదనుకున్న తమ బిడ్డ రెండు దేశాలు దాటి ఇండియాలో అడుగు పెట్టడంపై నాలుగు నెలలు దాటినా ఆ బాలిక కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. పాకిస్తాన్ నుంచి దుబాయ్కి అక్కడి నుంచి నేపాల్కు ఫ్లైట్లో దిగింది. నేపాల్ సరిహద్దు గుండా భారత్లో అడుగు పెట్టింది. ప్రియుడు బెంగళూరుకు తీసుకెళ్లాడు. కానీ, అసలు ట్విస్ట్ అక్కడే తగిలింది.
ఆన్లైన్లో ఏవో ఊహించుకున్న ఆ బాలిక కల నిజంగానే ముక్కలైపోయింది. బాయ్ఫ్రెండ్ తనను తాను ముస్లిం యువకుడిగా ఆమెతో పరిచయం చేసుకున్నాడు. కానీ, అతను హిందువు. అంతేకాదు, ఆమెకు చెప్పినట్టు ఆ యువకుడు సమీర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదు. బెంగళూరులో ఓ సెక్యూరిటీ గార్డు. పేరు ములాయం సింగ్ యాదవ్. ఈ విషయాలు తెలుసుకున్న ఆ బాలిక మళ్లీ తన కుటుంబం గురించి ఆలోచించింది. వాట్సాప్ ఓపెన్ చేసి తల్లికి ఫోన్లు చేయడం ప్రారంభించింది. చివరికి ఉభయ దేశాల అధికారులు స్పందించారు. ఆ బాలికను పాకిస్తాన్లోని వారి కుటుంబానికి చేర్చారు.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో సొహేల్ జీవాని కుమార్తె ఇక్రా జీవాని. లూడో ఆన్లైన్ గేమ్లో ఉత్తరప్రదేశ్కు చెందిన 26 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్తో టచ్లోకి వచ్చింది. అతడితో తరుచూ మాట్లాడేది. ప్రేమలో పడింది. అతడితో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది. ఇంటిలో చెప్పాపెట్టకుండా ఇండియాకు వచ్చేయాలని నిర్ణయం తీసుకుంది.
తన నగలను అమ్మేసింది. కాలేజీ ఫ్రెండ్స్ నుంచి డబ్బు అప్పుగా తీసుకుంది. సెప్టెంబర్లో ఇంటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం ఆందోళనలో పడింది. ఆమె పాకిస్తాన్ నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి ఖాట్మాండ్కు ఫ్లైట్లో వెళ్లింది. నేపాల్ సరిహద్దు వద్ద యాదవ్ను కలుసుకుంది. ఆమెను యాదవ్ బెంగళూరుకు, ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు. వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఆమెను స్థానికంగా రావా అనే హిందూ యువతిగా పరిచయం చేశాడు. ఆమె పేరిట ఓ ఆధార్ కార్డు కూడా చేయించాడు. భారత పాస్పోర్టు కోసం దరఖాస్తు చేశాడు. కానీ, ఆమె నమాజ్ చేయడం చూసి పొరుగు వారు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను షెల్టర్ హోంకు తీసుకెళ్లారు. ఆమె ఇండియాకు ఎలా వచ్చారో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
పాకిస్తాన్లో తల్లికి వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆమె కుటుంబం ఓ సీనియర్ పోలీసు అధికారికి తెలిపారు. అతను పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయానికి తెలియజేశాడు. వారు భారత వైపు అధికారులను సంప్రదించారు.
పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు తమకు సహకరించాయని, తమ బిడ్డను తాము తిరిగి పొందినందుకు వారికి కృతజ్ఞతగా ఉంటామని ఇక్రా అంకుల్ అఫ్జల్ తెలిపారు.
ఈ విషయం గురించి ఇక్రా కుటుంబీకులు ఎక్కువగా మాట్లాడలేదు. ఆ ఎపిసోడ్ ముగిసిపోయిందని, దాని గురించి అడగవద్దని కోరారు. వారంతా ఇంకా షాక్లోనే ఉన్నారని ఒకరు చెప్పారు. తాను ఒక ముస్లిం సాఫ్ట్వేర్ ఇంజినీర్తో ప్రేమలో పడ్డానని భావించిందని, కానీ, అక్కడికెళ్లాక మోసపోయినట్టు గ్రహించిందని అన్నారు. ఆమె ప్రేమలో పడింది కాబట్టి ప్రమాదపూరిత ప్రయాణాన్ని ఎంచుకుందని వివరించారు.
ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.