మన సైనికులు చనిపోయారు.. పాక్ తో మ్యాచ్ అవసరమా..? మండిపడ్డ అసదుద్దీన్..!

By telugu news teamFirst Published Oct 19, 2021, 12:19 PM IST
Highlights

ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెల‌రేగిపోతోన్న ఉగ్ర‌వాదం వ‌ల్ల మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రోవైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో భార‌త్‌ మ్యాచ్ ఆడుతుంద‌ని ఆయ‌న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డంలో కేంద్ర స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని అన్నారు.

టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా త్వరలో భారత్- పాకిస్తాన్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే..  ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ డిమాండ్లు పెరుగుతుండటం గమనార్హం.  ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ రద్దు చేయాలని చాలా మంది డిమాండ్ చేయగా.. ఈ జాబితాలోకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు. భారత్- పాక్ మధ్య మ్యాచ్ రద్దు చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కూడా చేశారు.

క‌శ్మీర్‌లో ఇటీవ‌ల‌ జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల్లో తొమ్మిది మంది భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని ఆయ‌న చెప్పారు.ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెల‌రేగిపోతోన్న ఉగ్ర‌వాదం వ‌ల్ల మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రోవైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో భార‌త్‌ మ్యాచ్ ఆడుతుంద‌ని ఆయ‌న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డంలో కేంద్ర స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని అన్నారు.

Latest Videos

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, లడఖ్‌లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయం గురించి ప్రధాని మోదీ అస్సలు మాట్లాడటం లేదని ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ రెండు అంశాల గురించి అస్సలు మాట్లాడటం లేదు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్‌లోని మన భూభాగంలో చైనా తిష్టవేసినా నోరువిప్పడం లేదు’ అని ఒవైసీ ధ్వజమెత్తారు.

‘చైనా గురించి మాట్లాడటానికి ప్రధాని భయపడుతున్నారు’ అంటూ విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పలు నగరాల్లో రూ.110 దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఒవైసీ విమర్శలు గుప్పించారు. అలాగే, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ పలు ఎదురుకాల్పుల్లో సైనికులు మరణాలపై కూడా ఒవైసీ స్పందించారు.

‘జమ్మూ కశ్మీర్‌లో మన సైనికులు తొమ్మిది మంది అమరులయ్యారు.. అలాంటప్పుడు అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ టీ20 క్రికెట్ మ్యాచ్ అడటమా?’ అని ప్రశ్నించారు. ‘మన సైనికులు చనిపోతే.. మీరు టీ20 ఆడతారా? కశ్మీర్‌లోని భారత ప్రజల ప్రాణాలతో పాకిస్థాన్ రోజూ 20-20 ఆడుకుంటోంది’ అని ఒవైసీ మండిపడ్డారు.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్.. సానియా మీర్జా రియాక్షన్ ఇదే..!

కశ్మీర్‌లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు. ‘బిహార్‌కు చెందిన పేద కూలీలను చంపేస్తున్నారు.. పౌరులే లక్ష్యంగా హత్యలు జరుగుతున్నాయి.. ఇంటెలిజెన్స్ బ్యూరో,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమి చేస్తున్నారు? ఇది కేంద్రం వైఫల్యం’అని విమర్శించారు.

శని, ఆదివారం వరుసగా కశ్మీర్‌లో ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌కు చెందిన వలస కూలీలను ఉగ్రవాదులు హత్యచేసిన విషయం తెలిసిందే. గత రెండు వారాల్లో 11 మందిని ఉగ్రవాదులు హత్యచేశారు.

click me!