
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. పార్లమెంటులో మంగళవారం ప్రతిపక్షాలు నిరసనలు చేశాయి. లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, వామపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. తాజాగా, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఆ తర్వాత మళ్లీ యథావిధిగానే ధరలు పెంచుతూ వస్తున్నదని మండిపడ్డారు.
కేవలం ఎన్నికలు మాత్రమే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు కళ్లెం వేస్తున్నాయని, కాబట్టి, ప్రతి నెలా ఎన్నికలు నిర్వహిస్తే చమురు ధరలు పెరగబోవని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్సభలో ఈ రోజు విమర్శలు గుప్పించారు.
ఇటీవలే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు జరిగినంత కాలం ఇంధన ధరలు పెరగలేవు. కానీ, ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వాలూ ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్లీ చమురు ధరలు పెరిగాయి. ఎన్నికల తంతు ముగియగానే మళ్లీ చమురు ధరలు పెరుగుతాయని చాలా మంది ముందుగానే ఊహించారు. ప్రభుత్వ తీరును ముందుగానే నిరసించారు.
మంగళవారం పెట్రోల్, డీజిల్ లీటర్ ధరపై సుమారు 80 పైసలు పెరిగాయి. కాగా, వంట గ్యాస్ ధరపై సిలిండర్కు రూ. 50 పెంచాలి. గత నాలుగున్నర నెలల పాటు చమురు ధరల్లో మార్పు లేదు. కానీ, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రేట్లు పెరగడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కాగా, 4 నవంబర్ 2021 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం గమనించదగ్గ విషయం. ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా నాలుగు నెలలుగా ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయని ముందే ఊహించారు. ఇటీవల ఎన్నికల తాజా ఫలితాలు వచ్చాక ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచే పర్వం కూడా మొదలైంది. మొదట చమురు కంపెనీలు డీజిల్ ధరను రూ. 25 పెంచాయి, ఇది హోల్సేల్ వినియోగదారుల కోసం ఎన్నడూ లేని విధంగా పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ పంపుల వద్ద లభించే ఇంధన ధరలను కూడా పెంచారు. డీజిల్ ధరలు 76 నుంచి 86 పైసలు పెరిగగా, పెట్రోల్ ధరలో 76 నుంచి 84 పైసలు పెరిగింది.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు సంబంధించి గతంలో వచ్చిన నివేదికలను పరిశీలిస్తే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని నిపుణులు అంచనా వేశారు. అటువంటి పరిస్థితిలో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ.15 నుండి 22 వరకు పెంచవచ్చు. వాస్తవానికి, దేశీయ చమురు కంపెనీలు 16 మార్చి 2022 లేదా అంతకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 12.1 పెంచాల్సి ఉంటుందని, కేవలం ఖర్చులను భర్తీ చేయడానికి మాత్రమే ఈ పెంపు అని ఒక నివేదిక పేర్కొంది. దీనికి మార్జిన్ (లాభం) కూడా కలిపితే లీటరుకు రూ.15.1 పెంచాల్సి ఉంటుంది. సహజంగానే, చమురు కంపెనీలు ఈ పెంపుదల చేస్తే దేశంలోని సామాన్య ప్రజలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.