Indian Air Defense Downs 600 Pakistani Drones: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. పాక్ కు కోలుకోని దెబ్బకొట్టింది. భారత సైన్యం 600+ పాకిస్తానీ డ్రోన్లను కూల్చింది. LoC నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు భారత్ వైమానిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. శత్రుదాడులను క్షణాల్లో పసిగట్టడంతో పాటు దాడులను ధీటుగా ఎదుర్కొనే రక్షణ కవచాన్ని భారత్ ఎలా ఏర్పాటు చేసుకుందో తెలుసుకుందాం.
భారత సైన్యం 1000+ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, 750+ షార్ట్ రేంజ్ SAMలను మోహరించింది. డ్రోన్లతో పాటు పెద్ద వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి దీనిని ఏర్పాటు చేశారు.
ఆకాశ్ తీర్ అనేది భారతదేశం అభివృద్ధి చేసిన ఒక స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థ. వైమానిక దళం ఆకాశ్ తీర్, IACCSలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. పాక్ డ్రోన్ లేదా క్షిపణి సరిహద్దులోకి ప్రవేశించగానే, IACCS ఆకాశ్ తీర్ కమాండ్ పోస్ట్కు సమాచారం అందించి, ముప్పును తొలగించడానికి తగిన ఆయుధాన్ని సూచిస్తుంది.
L-70 ఎయిర్ డిఫెన్స్ గన్: 1970లలో స్వీడన్ నుండి తీసుకున్న ఈ గన్ నిమిషానికి 300+ రౌండ్లు కాల్పులు జరుపుతుంది. ఇప్పుడు ఆధునిక సెన్సార్లు, కెమెరాలు, రాడార్లతో అమర్చబడింది.
Zu-23mm గన్: రష్యా నుండి తీసుకున్న ఈ డ్యూయల్ బారెల్ గన్ నిమిషానికి 3200-4000 రౌండ్లు కాల్పులు జరుపుతుంది, 2.5 కి.మీ. వరకు ప్రభావవంతంగా ఉంటుంది.
Shilka గన్ సిస్టమ్: ట్రాక్డ్ వాహనంపై ఉన్న ఈ జు-23mm ట్విన్ గన్ నిమిషానికి 8000 రౌండ్లు కాల్పులు జరుపుతుంది. కఠినమైన ప్రాంతాల్లో కూడా పనిచేస్తుంది.
22 ఏప్రిల్న పహల్గాంలో 26 మంది పౌరుల మరణం తర్వాత భారత సైన్యం 7 మేన ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ప్రతీకార చర్యలు తీసుకుంది. దీని తర్వాత పాక్ సైన్యం జైసల్మేర్, అమృత్సర్, శ్రీనగర్, బారాముల్లా నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. భారత్ తిరిగి ధీటుగా స్పందించి పాక్ కు మరింత నష్టం కలిగించింది.
భారత్ ప్రతిదాడుల తర్వాత 10 మేన పాకిస్తాన్ చర్చలకు ప్రతిపాదించింది. సైనిక స్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దు కాల్పులను ఆపడానికి రెండు దేశాలు అంగీకరించాయి.